CM YS Jagan – Protests : రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ నడివీధిన నిలబడింది. జాతీయ స్థాయిలో పలుచన అయ్యింది. అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేసి మూడు రాజధానులు తేవాలన్నజగన్ ఆ పని చేయలేకపోయారు. న్యాయపరమైన చిక్కులు, అడ్డంకులు అధిగమించలేకపోయారు. కాలగర్భంలో వైసీపీ సర్కారు నాలుగేళ్ల పాలన కలిసిపోయింది. ఉన్నది ఒక్క ఏడాది మాత్రమే. పోనీ ఈ ఏడాదిలోనైనా రాజధాని కొలిక్కి వస్తుందంటే చెప్పలేని పరిస్థితి. జాతీయ స్థాయిలో ఏపీ అంటే జాలిగాచూసే పరిస్థితులు దాపురించాయి. నాలుగేళ్ల పాటు అవమరాతిని చంపే ప్రయత్నం చేయగా.. అటు మూడు రాజధానులకు ఒక్క అడుగు ముందుకు వేయలేకపోయారు.
ఆ ప్రకటనను గుర్తుచేస్తూ..
త్వరలో విశాఖ నుంచి పాలన అంటూ సీఎం నుంచి మంత్రుల వరకూ ప్రకటనలు చేస్తున్నారు. మీ బిడ్డ సెప్టెంబరు నుంచి విశాఖలోనే కాపురం పెడతాడంటూ ఆ మధ్యన జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజధాని అన్న పేరు ప్రస్తావించకుండా.. కాపురం పెడతానంటూ చెప్పడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఉత్తరాంధ్ర పర్యటనకు వస్తున్న సీఎంకు నిరసన సెగలు తగులుతున్నాయి. బుధవారం ఉత్తరాంధ్రలో కీలక నిర్మాణాలను సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్న సంగతి తెలిసిందే. దీంతో రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వాగతం అంటూ ఫ్లెక్సీలు విశాఖ నగరంలో వెలిశాయి. జనజాగరణ సమితి పేరిట విశాఖ బీచ్ రోడ్డులో ఇవి కనిపించాయి.
ఆ కొత్త ఎత్తుగడపై..
చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అమరావతి రాజధానిగా ఉంటుందని అంతా అనుకున్నారు.కానీ జగన్ అనూహ్యంగా అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చారు. జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాదే అంటే 2019 చివరిలో అసెంబ్లీలో అభివృద్ధి కోసం మూడు రాజధానులు తీసుకొస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇక అక్కడ నుంచి అమరావతి ప్రాంత ప్రజలు ఉద్యమం చేస్తూ వచ్చారు…అటు ప్రతిపక్ష టీడీపీ సైతం అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. మూడు రాజధానులు వద్దు….అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని వారు డిమాండ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉంది. కానీ రాజధాని అన్న కాన్సెప్ట్ కాకుండా విశాఖ నుంచి పాలనకు సీఎంజగన్ సిద్ధపడుతున్నారు. అందుకే రాజధాని లేని రాష్ట్ర సీఎంగా జగన్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి మరీ..