Parliament Elections 2024: ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. మన దేశంలో నిర్వహించే సార్వత్రిక ఎన్నికలను ప్రజాస్వామ్య పండుగగా భావిస్తారు. ఈ సమరంలో వివిధ రూపాల్లో వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. ఇక నిపుణుల అంచనా ప్రకారం.. 2024 లోక్సభ ఎన్నికల ఖర్చు ప్రపంచంలోనే అత్యధికంగా రూ.1.35 లక్షల కోట్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ఓపెన్ సీక్రెట్స్ సంస్థ ప్రకారం 2020 అమెరికా ఎన్నికల వ్యయం(రూ.1.2 లక్షల కోట్లు)ను ఇది దాటిపోయింది. ఆ దేశంలో మొత్తం ఓటర్లు 06.6 కోట్ల మంది కాగా.. ఒక్కో ఓటరుకు రూ.1,400 ఖర్చు చేస్తున్నారన్నమాట. ఇక భారత్లో 2019 లోక్సభ ఎన్నికలకు రూ.600 వేల కోట్లు ఖర్చు చేశారు. ఈసారి రెట్టింపు కంటే ఎక్కువ ఖర్చు కానుండటం గమనార్హం.
35 ఏళ్లుగా పరిశీలన..
ఇక భారత ఎన్నికల వ్యవయాన్ని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ (సీఎంఎస్) స్వచ్ఛంద సంస్థ.. 35 ఏళ్లుగా నిశితంగా పరిశీలిస్తోంది. ఈక్రమంలో 2024 ఎన్నికల్లో భారీ ఖర్చు అవనున్నట్లు సంస్థ చైర్మన్ భాస్కర్రావు అంచనా వేశారు. ఈ సమగ్ర వ్యయంలో ఎన్నికల సంఘంతోపాటు ప్రభుత్వాలు, అభ్యర్థులు, పలు సంస్థలు, రాజకీయ పార్టీలు చేసే అన్నిరకాల ఎన్నికల సంబంధిత ఖర్చులు ఉంటాయని వివరించారు.
మూడు, నాలుగు నెలల ముందే..
ఎన్నికల వ్యయం మొదట రూ.1.2 లక్షల కోట్లు అవుతుందని సీఎంఎస్ అంచనా వేసింది. అయితే.. ఎలక్టోరల్ బాండ్ల వివరాలు బహిర్గతం కావడం, ఎన్నికల సంబంధిత ఖర్చులన్నింటినీ లెక్కించడం వంటి అంశాల ఆధారంగా ఈ ఖర్చు రూ.1.35 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా వేశాం. ఎన్నికల తేదీలను ప్రకటించడానికి మూడు, నాలుగు నెలల ముందు నుంచి చేసిన వ్యయాలు ఇందులోకి వస్తాయని సీఎంఎస్ చీఫ్ వివరించారు. ఎన్నికల బాండ్ల నుంచే కాకుండా వివిధ మార్గాల్లో ధన ప్రవాహం కొనసాగుతుందన్నారు.
వాస్తవ వ్యయం మరింత ఎక్కువ..
వాస్తవ వ్యయం మరింత ఎక్కువ..
సీఎంఎస్ అంచనా ప్రకారం.. ఎన్నికలకు ముందు నుంచి పార్టీలు, అభ్యర్థులు చేసే ప్రచార ఖర్చుల్లో, బహిరంగ సభలు, రవాణా, క్షేత్రస్థాయిలో వర్కర్లు, ఇన్ఫ్లూయెన్సర్లు సహా నేతల బేరసారాలు ఇందులో భాగమే. మొత్తం అంచనాల్లో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం చేసే ఖర్చు 10 నుంచి 15 శాతమే. ఎన్నికల వ్యయంలో వివిధ మాధ్యమాల ద్వారా పెట్టే ప్రచార ఖర్చు 30 శాతం ఉంటుంది. ఈ 45 రోజుల ప్రచార సమయంలో కనిపించే ఖర్చు కంటే వాస్తవ వ్యయం మరింత ఎక్కువగా ఉంటుందని భాస్కరరావు తెలిపారు.
45 శాతం ఆ పార్టీదే..
భారత ఎన్నికల సంఘం విధించిన వ్యయ పరిమితుల కిందకు రాకుండా పార్టీలు, అభ్యర్థులు పలుమార్గాలు అన్వేషిస్తుంటాయి. 2019 ఎన్నికల్లో రూ.60 వేల కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా వేయగా.. ఇందులో 45 శాతం భాజపాదే. ప్రస్తుత ఎన్నికల్లో ఇది భారీగా పెరిగే అవకాశం ఉందని సీఎంఎస్ చీఫ్ తెలిపారు. ప్రచారంలో డిజిటల్ వేదికల పాత్ర మరింత పెరిగిందన్నారు. సిద్ధాంతాల కంటే ధనబలంపైనే విశ్వాసం పెరుగుతోందని ఇటీవల రాసిన ‘నెక్ట్స్ బిగ్ గేమ్ ఛేంజర్ ఆఫ్ ఎలక్షన్స్’ పుస్తకంలో భాస్కరరావు వివరించారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read More