Homeజాతీయ వార్తలుPM Modi: మోడీ.. కం** వ్యాఖ్యలు.. అసలు వివాదమేంటి? ఎవరిది తప్పు?

PM Modi: మోడీ.. కం** వ్యాఖ్యలు.. అసలు వివాదమేంటి? ఎవరిది తప్పు?

PM Modi: పార్లమెంట్ ఎన్నికలవేళ ఇటీవల రాజస్థాన్ రాష్ట్రంలో ప్రచారం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన “ఎక్కువ పిల్లలు ఉన్నవారు” అనే వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. రాజకీయంగా పెను దుమారాన్ని లేపాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి మొదలుపెడితే ఆప్ వరకు విమర్శలు చేశాయి. అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్యల పట్ల ఎంఐఎం అధినేత, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. నరేంద్ర మోడీకి గట్టి కౌంటర్ ఇచ్చారు. ” ముస్లిం సమాజంలో పురుషులు ఎక్కువగా కం** లు వాడుతున్నారు. పిల్లలను కనే విషయంలో చాలా ఎడం పాటిస్తున్నారు. ప్రభుత్వ రికార్డులు కూడా అదే చెబుతున్నాయి. కానీ ప్రధానమంత్రి మాత్రం ఎక్కువ మంది పిల్లల్ని ముస్లింలు పుట్టిస్తున్నారని చెబుతున్నారు. నరేంద్ర మోడీకి ఆరుగురు సోదరులు. అమిత్ షాకు ఆరుగురు సోదరీమణులు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు 12 మంది సోదరీమణులున్నారు. కేంద్ర గణాంకాల ప్రకారం ముస్లింల సంతానోత్పత్తి క్రమంగా తగ్గుముఖం పడుతోందని” అసదుద్దీన్ పేర్కొన్నారు.

రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీ “ఎక్కువ మంది పిల్లలు” అని చేసిన విమర్శలు ఇప్పటికీ చర్చకు తావిస్తున్నాయి. వాస్తవంగా ప్రధానమంత్రి స్థాయిలో నరేంద్ర మోడీ అలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని సొంత పార్టీలో కొంతమంది నాయకులు సమర్ధించలేకపోతున్నారు. ” కేవలం హిందువుల ఓట్ల వల్లే బిజెపి పార్లమెంట్ ఎన్నికల్లో గెలవదు. అలా అనుకుంటే ఉత్తర ప్రదేశ్ లో బిజెపి రెండవసారి అధికారంలోకి వచ్చిందంటే ముస్లిం ఓట్లే కారణం. అలాంటప్పుడు వాళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేస్తే అది ఎన్నికల్లో తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని” పేరు రాసేందుకు ఇష్టపడని కొంతమంది బిజెపి నాయకులు అంతర్గతంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఇదే సమయంలో అసదుద్దీన్ ఓవైసీ మోడీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడాన్ని కూడా తప్పుపడుతున్నారు. ” గతంలో పార్టీ మీటింగ్ లో కొంత సమయం ఇస్తే చాలు హిందువులను మొత్తం లేపేస్తామని అసదుద్దీన్ ఓవైసీ సోదరుడు అక్బరుద్దీన్ హెచ్చరించారు. అప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలాంటి వ్యక్తి నేడు నరేంద్ర మోడీ మాటలకు కౌంటర్ ఇవ్వడం సరికాదని” వారు అంటున్నారు.

మరోవైపు నరేంద్ర మోడీ, అసదుద్దీన్ ఓవైసీ పట్ల ప్రజాస్వామ్యవాదులు మండిపడుతున్నారు. రాజకీయాల్లో మతాన్ని ప్రస్తావించడం దేనికని విమర్శిస్తున్నారు. ప్రజల మధ్య భావోద్వేగాలను రెచ్చగొడితే అది అంతిమంగా దేశ అభివృద్ధిపై ప్రభావం చూపిస్తుందని గుర్తు చేస్తున్నారు. ” ప్రపంచం సాంకేతికత వైపు ప్రయాణం చేస్తోంది. అభివృద్ధివైపు పరుగులు తీస్తోంది. టెక్నాలజీ అనేది మనిషి జీవితాన్ని సమూలంగా మార్చేస్తోంది. ఇలాంటి సమయంలో కొంతమంది నాయకులు తమ స్వలాభం కోసం ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. వారిని ఘర్షణ పూరితమైన వాతావరణంలోకి తీసుకెళ్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలను వారు మానుకోవాలి. రాజకీయ స్వలాభం కోసం ప్రజలను పావులుగా వాడుకోకూడదు. ప్రజలు కొట్టుకొని చస్తే వారికి క్రీడా వినోదమవుతుందా” అంటూ వారు విమర్శిస్తున్నారు.

ఎన్నికలంటే పరిపాలనకు రెఫరండమని.. పరిపాలన బాగుంటే ప్రజలు ఓట్లు వేస్తారని.. లేకుంటే తిరస్కరిస్తారని గుర్తు చేస్తున్నారు. అధికారం కోల్పోయిన వారు ప్రజాభిమానాన్ని పొందాలని.. అధికారాన్ని దక్కించుకున్న వారు ప్రజల ఆదరణను సుస్థిరం చేసుకోవాలని.. అంతేతప్ప ఇలా భావోద్వేగాలు రెచ్చగొట్టే విమర్శలు చేస్తే అది అంతిమంగా దేశానికే ప్రమాదం కలగజేస్తుందని రాజకీయ నిపుణులు హితవు పలుకుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular