RBI Website Crash: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2000 నోట్ల చలామణి ఉండదని తాజాగా ప్రకటించింది. మార్కెట్లో ఉన్న నోట్లను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. వినియోగదారులకు రూ.2 వేల నోట్లు ఇవ్వొద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. రూ.2 వేల నోట్లు ఉన్నవారు మే, 23 నుంచి సెప్టెంబరు 30లోగా బ్యాంకులు, ఆర్బీఐ కార్యాలయాల్లో మార్చుకోవచ్చని తెలిపింది. అయితే ఈ ప్రకటన నిజమా కాదా అని తెలుసుకునేందుకు లక్షలాది మంది ఒకేసారి ఆర్బీఐ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేశారు. దీంతో కొంతసేపు సైట్ ఆగిపోయింది. సేవలకు అంతరాయం కలిగింది.
2016లోనూ ఇలాగే..
ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2016లో మొదటిసారిగా పెద్దనోట్లు(రూ. 500, రూ.1000) రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పుడు కూడా ఆర్బీఐ సైట్కు అంతరాయమే ఏర్పడింది. ఎవరూ ఊహించని విధంగా రాత్రి సమయంలో ఈ ప్రకటన చేసినప్పుడు చాలా మంది ప్రజలు వాస్తవం తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ సందర్శించారు. ఎక్కువ మంది ఒక్కసారిగా ఈ వెబ్సైట్ ఓపెన్ చేయడంలో క్రాష్ అయింది. మళ్లీ ఏడేళ్ల తర్వాత అలాంటి సంఘటనే తాజాగా పునరావృతమైంది.
బ్లాక్ మనీ కట్టడికి..
దేశంలో నల్లధనం కట్టడికి 2016లో మోదీ రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేశారు. వాటికి బదులు కొత్తగా రూ.2000 నోట్లు తీసుకువచ్చారు. ఈ నోట్లతో చిల్లర సమస్య ఏర్పడింది. అయితే ఇవీ ఎంతోకాలం చలామణిలో లేవు. దాదాపు నాలుగేళ్లుగా రూ.2000 నోట్లు కనిపించడం లేదు. ఈ క్రమంలో వాటి ముద్రణను కూడా 2018-19 ఆర్థిక సంవత్సరంలోనే ఆర్బీఐ నిలిపివేసింది. వీటి తయారీకి పేపర్ ఖర్చు ఎక్కువగా ఉండడం, రంగులు, దారం కూడా దిగుమతి చేసుకోవాల్సి ఉండడంతో 2018, మార్చి 31 నాటికి ప్రింటింగ్ ఆపేసింది. దీంతో అప్పటి వరకు చలామణిలో ఉన్న రూ.2000 నోట్ల విలువ సుమారు రూ.6.73 లక్షల కోట్లు.
రూ.2000 నోట్లు బ్లాక్..
తాజాగా రూ.2000 నోట్లు కూడా బ్లాక్ అయ్యాయి. రాజకీయ నేతలు, వ్యాపారులు, రియల్టర్లు రూ.2 వేల నోట్లు బ్లా్క్ చేశారు. దీంతో వాటి చలామణి పూర్తిగా తగ్గిపోయింది. ఈ విషయాన్ని గుర్తించిన ఆర్బీఐ రూ.2000 నోట్లతో నల్లధనం పెరిగే అవకాశం ఉందని భావించింది. ఈ క్రమంలో మే 19న రూ.2000 నోట్ల చలామణి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వాటిని ఉపసంహరించుకున్నట్లు తెలిపింది. అదే సమయంలో మే 23 నుంచి ఏ జాతీయ బ్యాంకులోనైనా రూ.2 వేల నోట్లను మార్చుకోవచ్చని సూచించింది. అయితే ఒక వ్యక్తి ఒక సారికి కేవలం 10 నోట్లను మాత్రమే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ నోట్లను మార్చుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30గా ప్రకటించింది.