Jithender Reddy- Etela Rajender: ఎన్నికలంటేనే డబ్బు.. ఆ డబ్బును చాకచక్యంగా పంచగలిగినప్పుడే గెలుపు.. నాగార్జునసాగర్, దుబ్బాక, హుజురాబాద్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్.. ఎన్నికల్లో ధన ప్రవాహం ఏ స్థాయిలో ప్రవహించిందో చూశాం కదా! ఇప్పుడు మునుగోడులో కూడా అంతకుమించి ధనస్వామ్యం వర్ధిల్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత మునుగోడులో ఉప ఎన్నిక అనేది లాంచనమే అయినప్పటికీ.. ప్రధానంగా పోటీ కాంగ్రెస్, టిఆర్ఎస్, బిజెపి మధ్య ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ పోరులో మిగతా పార్టీలకంటే బిజెపి ఒక అడుగు ముందు ఉంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మూసి ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ ప్రాంతం మునుగోడు నియోజకవర్గానికి కూతవేటు దూరంలో ఉంది. ఇక ఇప్పటికే ఆ పార్టీ అధినాయకత్వం మొత్తం కూడా మునుగోడులో తిష్టవేసింది. దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికల్లో బిజెపిని విజయతీరాలకు చేర్చే బాధ్యత భుజాన వేసుకొని సఫలీకృతులైన జితేందర్ రెడ్డికే పార్టీ అధిష్టానం నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. మరోవైపు చేరికల కమిటీ సభ్యుడిగా ఉన్న ఈటల రాజేందర్ కి కూడా కీలక పాత్ర అప్పగించింది. వీరిద్దరిపైన బిజెపి ఆశలు పెట్టుకుంది.
అందర్నీ లాగుతున్నారు
అసెంబ్లీ ఎన్నికలకు ఒక ఏడాది ముందుగా మునుగోడుకు ఉప ఎన్నికలు రావడంతో అన్ని పార్టీల దృష్టి ఈ నియోజకవర్గం పైనే ఉంది. ఇప్పటికే దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన టిఆర్ఎస్ తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నది. ముఖ్యంగా హుజూరాబాద్ ఎన్నికల్లో సామ, దాన, బేధ, దళిత బంధు ఉపాయాలను పన్నిన్నా అధికార టీఆర్ఎస్ కు ఓటమి తప్పలేదు. వందల కోట్ల డబ్బును వెదజల్లినా విజయం దక్కలేదు. ఒక్కొక్కరుగా నేతలు బయటకు వెళ్తుండటంతో రెడ్డి నాయకత్వంపై నీలి నీడలు అలముకున్నాయి. ఈ నేపథ్యంలో దుబ్బాక నియోజకవర్గం ఈ రెండు పార్టీలకు చావో రేవో. అయితే ఈ ఉపఎన్నిక కూడా బిజెపికి ఎంతో ప్రతిష్టాత్మకం. ఎందుకంటే ఆ పార్టీకి దక్షిణ తెలంగాణలో బలం లేదు.
Also Read: Bendapudi Students: అమెరికా యాసలో దంచేసిన బెండపూడి విద్యార్థులు..ట్రోలింగ్ ను ఎదిరించి నిలిచారు
అక్కడక్కడ ఉనికి మాత్రమే ఉంది. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు ద్వారా తమది వాపు కాదని నిరూపించుకోవాలంటే ఇక్కడ తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి. ఇలాంటి తరుణంలో భారతీయ జనతా పార్టీ జితేందర్ రెడ్డి, ఈటల రాజేందర్ పైనే గంపెడు ఆశలు పెట్టుకుంది. ఈ తరుణంలోనే అధిష్టానం తమకు పచ్చ జెండా ఊపడంతో వారు తమ కార్యాచరణకు పదును పెట్టారు. ఇందులో బాగానే మునుగోడు నియోజకవర్గ పరిధిలోని సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటిసి లపై ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపారు. వారి వారి స్థాయిని బట్టి పంపకాలు చేపడుతున్నారు. ఈ నియోజకవర్గ పరిధిలో ముదిరాజులు అధికంగా ఉండటంతో ఈటల రాజేందర్ కులం కార్డును ఉపయోగిస్తున్నారు. పైగా తన సంస్థకు చెందిన హేచరీలు మొత్తం నల్గొండ జిల్లాలో విస్తరించి ఉండటంతో ఈ ప్రాంతం మొత్తం ఈటల రాజేందర్ కు సుపరిచితమే. పైగా జితేందర్ రెడ్డి పూర్వీకులు నల్లగొండ వారే. ఇక్కడ ఆయనకు బంధుత్వం ఉండటంతో ఆ పరిచయాలతోనే ఆయన చాకచక్యంగా పనిచేసుకుంటూ వెళ్తున్నారు.
యువతకే అధికంగా అవకాశాలు
ఇక ఈటెల రాజేందర్, జితేందర్ రెడ్డి తమ టీం లో ఎక్కువగా యువతనే నియమించుకుంటున్నారు. ఇప్పటికప్పుడు సర్వే నిర్వహిస్తూ వాటి ఫలితాలు ఆధారంగా తదుపరి కార్యాచరణకు శ్రీకారం చుడుతున్నారు. బిజెపి కేంద్రంలో ఉండటం, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆర్థికంగా బలంగా ఉండటంతో ఈటెల రాజేందర్, జితేందర్ రెడ్డి సాఫీగా తమ పని చేసుకుంటూ పోతున్నారు. గతంలో 2014 ఎన్నికల సమయంలో ప్రభాకర్ రెడ్డి పోటీ చేసినప్పుడు ఈటెల రాజేందర్ ఇక్కడ ప్రచారం నిర్వహించారు. అప్పట్లో ఈ నియోజకవర్గ మొత్తం ఆయన కలియతిరి గారు. ఆ అనుభవంతోనే ప్రస్తుతం ఇక్కడ కూడా బిజెపి విజయానికి కార్యాచరణ రూపొందిస్తున్నారు.
దానిని ఆచరణలో పెడుతున్నారు. అయితే ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా అధికార టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల పైన గాలం వేశారు. కాంగ్రెస్ వాళ్ళని కూడా వదిలిపెట్టడం లేదు. అయితే సొంత పార్టీలో ఉన్న నాయకులను ఇతర పార్టీలోకి వెళ్లకుండా చూసుకుంటున్నారు. సర్పంచులకు అయితే ₹ఐదు నుంచి ₹పది లక్షలు, ఎంపీటీసీలకు ₹15 లక్షలు, జెడ్పిటిసిలకు ₹25 నుంచి ₹30 లక్షల వరకు ఇస్తున్నట్టు సమాచారం. ఈ ప్రాంతంలో ముదిరాజులు, యాదవులు, గౌడ కులస్తుల ఓట్లు అధికంగా ఉండటంతో వారితో రహస్యంగా మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. పైగా వారందరినీ కూడా హైదరాబాదులోని ఇతర రిసార్ట్లకు తీసుకొచ్చి వారికి ఏం కావాలో ఇచ్చేందుకు ఒక అంగీకారానికి వస్తున్నట్లు సమాచారం. అయితే ఈ మూడు కులాలు కూడా గతంలో కాంగ్రెస్కు జై కొట్టాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఈ కుల సంఘ భవనాలకు వ్యక్తిగతంగా డబ్బులు ఇచ్చారు. ఆ గౌరవంతోనే ఈ మూడు కులాల నేతలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి మద్దతు ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. అయితే ఈ కులాల్లో మరో వర్గాలు కూడా ఇతర పార్టీ నాయకులకు తమ మద్దతును తెలియజేస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితిని చూస్తే ఈటల రాజేందర్, జితేందర్ రెడ్డి పాచికలు మునుగోడులో పారే అవకాశాలే కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు వరకు అభ్యర్థులను ప్రకటించకపోవడమే ఇందుకు సంకేతాలని బిజెపి నాయకులు అంటున్నారు.
Also Read:Munugodu By Election: మునుగోడు గ్రౌండ్ రిపోర్ట్ ఇదీ