Pawan Kalyan BJP: ఏపీలో జనసేన, బీజేపీ పొత్తుపై కొన్ని నెలల కిందట పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాము బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని క్లారిటీ ఇచ్చారు. దీంతో జనసేన, బీజేపీలు కలిసే ఉంటాయని అందరూ భావించారు. కానీ అందరికీ షాక్ ఇచ్చేలా పవన్ ఇటీవల సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీలో పర్యటించిన సందర్బంగా పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. ఈ కార్యక్రమానికి పవన్ కు ఆహ్వానం ఉన్నా గైర్హాజరయ్యారు. దీంతో జనసేన, బీజేపీల మధ్య పొత్తు ఉన్నట్లా…? లేనట్టా..? అనే కొత్త చర్చ మొదలైంది. కొందరు జనసేన నాయకులు పరోక్షంగా బీజేపీతో అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. అటు బీజేపీ నాయకులు కూడా జనసేన కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఈ బంధం తెగినట్లేనని అనుకున్నారు. కానీ పవన్ ప్రధాని సభకు హాజరు కాకపోవడంపై తాజాగా ఏపీలో పర్యటించిన పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. అదే ఇప్పుడు చర్చనీయాంశమైంది.
అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భీమవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లను చేసింది. కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. మెగాస్టార్ చిరును కూడా ఈ సభకు రావాలని కిషన్ రెడ్డి కోరారు. అయితే స్థానిక ఎంపీ రఘురామరాజును పట్టించుకోలేదు. అంతేకాకుండా తనను ఈ సభకు రాకుండా హైదరాబాద్ లోనే అడ్డుకున్నారని రఘురామ ఆరోపించారు. దీంతో ఆయన భీమవరంకు ట్రైన్లో బయలు దేరినా.. మధ్యలోనే దిగి వెనుదిరిగారు.
స్థానిక ఎంపీని రాష్ట్రప్రభుత్వం పట్టించుకోనప్పుడు తాను ఈ కార్యక్రమానికి హాజరు కావడం కరెక్ట్ కాదని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రధాని మోడీ సభకు తాను ఎందుకు హాజరు కాలేదో వివరించారు. ‘మోదీ పర్యటనకు నేను హాజరు కాకపోవడంపై రకరకాల కథనాలు వస్తున్నాయి.. అయితే స్థానిక ఎంపీకీ ఆహ్వానం లేనప్పుడు నేను వెళ్లడం సమంజసం కాదు. అందుకే నాకు ఆహ్వానం ఉన్నా వెళ్లలేదు’ అని క్లారిటీ ఇచ్చాడు. బీజేపీతో మైత్రి బంధం ఉన్న నేపథ్యంలో రఘురామతో పనేంది అని పవన్ కళ్యాణ్ వివరణపై కొందరు బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.
వైసీపీకి చెందిన ఎంపీ రఘురామరాజు ప్రస్తుతం ఆ పార్టీలోనే కొనసాగుతున్నా రెబల్ గా మారారు. అయితే ఆయన బీజేపీ వ్యక్తి అని ప్రచారం జరుగుతున్నా వైసీపీకి రాజీనామా చేయకుండా అందులోనే కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. నిజంగానే ఎంపీ కోసం పవన్ మోదీ సభకు హాజరు కాలేదా..? లేక మరెదైనా కారణం ఉందా..? అని చర్చించుకుంటున్నారు. అయితే బీజేపీతో పొత్తు ఉందని పవన్ చెబుతున్నా కొన్ని విషయాల్లో మాత్రం కమలం పార్టీ నాయకులు కలిసి రావడం లేదు. ఇటీవల జనసేన చేపట్టిన కౌలు రైతు యాత్రల్లో బీజేపీ నాయకులు మచ్చుకైనా కనిపించడం లేదు. అలాగే బీజేపీ సభలు, సమావేశాలకు పవన్ కళ్యాణ్ పోవడం లేదు. బీజేపీ చేపడుతున్న కార్యక్రమాల్లో జనసైనికులు పాలు పంచుకోవడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఈ మైత్రి బంధం ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది.