KCR Petition
KCR Petition: తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ప్రస్తుత ప్రభుత్వం కమిషన్లు వేసి విచారణ జరిపిస్తోంది. విద్యుత్ కొనుగోళ్లు, కొత్త విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంపై జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్, కళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపై జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది. దాదాపు మూడు నెలలుగా ఆయా కమిషన్లు విచారణ జరుపుతున్నాయి. అయితే విద్యుత్ కమిషన్ తీరుపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యతరం వ్యక్తం చేశారు కమిషన్ను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన వేయగా దానిని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. ఆయనకు స్వల్ప ఊరట లభించింది.
కీలక ఆదేశాలు..
కేసీఆర్ సీఎంగా ఉన్న పదేళ్ల కాలంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాల్లో జరిగిన అక్రమాలపై విచారణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్ కమిషన్ చైర్మన్గా ఉంటూ ప్రెస్మీట్ నిర్వహించడాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ తప్పుపట్టారు. న్యాయమూర్తి న్యాయం చెప్పడమే కాకుండా.. నిష్పక్షపాతంగా ఉండాలన్నారు. విద్యుత్ కమిషన్ చైర్మన్గా మరొక జడ్జిని నియమించాలని సూచించారు. చీఫ్ జస్టిస్ సూచనకు తెలంగాణ ప్రభుత్వ లాయర్ అంగీకరించారు. మధ్యాహ్నం తర్వాత కొత్త విద్యుత్ కమిషన్ చైర్మన్గా ఎవరిని నియమిస్తారో చెప్పాలన్నారు.
కమిషన్ను రద్దు చేయాలని పిటిషన్..
ఇదిలా ఉంటే.. విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం.. భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం తదితర అంశాలపై విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ కేసీఆర్కు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో కేసీఆర్ పాత్రపై వివరణ కోరింది. కమిషన్కు వివరణ ఇచ్చిన కేసీఆర్ వ్యక్తిగతంగా వెళ్లకుండా హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ అనుకూలంగా తర్పీ రాకపోవంతో విద్యుత్ కమిషన్ నియామకం, ఆ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి ముందుగానే అభిప్రాయాలు చెప్పడం వంటి వాటిపై కేసీఆర్ సుప్రీకోర్టుకు వెళ్లారు. కమిషన్ చైర్మన్ చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, ముందే నిర్ణయానికి వచ్చినట్లుగా ప్రెస్మీట్లు పెడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
కమిషన్ ఏర్పాటే చట్ట విరుద్ధమని..
కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీ యాక్ట్ 1952, విద్యుత్ చట్టం 2003 ప్రకారంవిచారణ కమిషన్ చట్ట విరుద్ధమని కేసీఆర్ సుప్రీం కోర్టుకు తెలిపారు. విద్యుత్తు కొనుగోళ్లపై వివాదం ఉంటే.. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండళ్లు తేల్చాలే తప్ప.. దానిపై విచారణ జరిపే అధికారం కమిషన్కు లేదని తెలిపారు. అయితే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ .. ప్రస్తుత విద్యుత్ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడంపైనే అభ్యంతరాలు వ్యక్తం చేశారు. చైర్మన్ను మార్చాలన్నారు. కేసీఆర్ వ్యక్తం చేసిన అభ్యంతరాల్లో అది కూడా ఒకటి. కొత్త న్యాయమూర్తి పేరును చెప్పిన తర్వాత విచారణ కొనసాగించడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇస్తే.. అది కేసీఆర్ కు ఇబ్బందేనని భావిస్తున్నారు.
విచారణకు ఆటంకం లేనట్లే?
ఇక విచారణ కమిషన్పై ప్రస్తుతం సుప్రీం కోర్టు ఎలాంటి అభ్యంతరం తెలుపలేదు. చైర్మన్ను మాత్రమే మాచ్చాలని సూచించింది. అంటే కమిషన్ను కొనసాగించాలని పరోక్షంగా చెప్పినట్లే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే కొత్త చైర్మన్ను నియమించిన తర్వాత దీనిపై కూడా వాదనలు వినిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విచారణకు సుప్రీం కోర్టు అనుమతి ఇస్తే కేసీఆర్కు అన్ని దారులు మూసుకుపోతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కమిషన్ విచారణను ఆయన ఎదుర్కోవాల్సి ఉంటుంది.