Homeఆంధ్రప్రదేశ్‌CM Chandrababu: రెండిటికీ చెడ్డ రేవడి.. జగన్ ను వదిలి చంద్రబాబు వద్దకు వస్తే దక్కని...

CM Chandrababu: రెండిటికీ చెడ్డ రేవడి.. జగన్ ను వదిలి చంద్రబాబు వద్దకు వస్తే దక్కని గౌరవం.. రెడ్డి సామాజిక వర్గంలో అంతర్మధనం!

CM Chandrababu: జగన్ ను చంద్రబాబు అనుసరిస్తున్నారా? అదే తప్పును చేస్తున్నారా? సామాజిక వర్గ లెక్కలు వేసుకుంటున్నారా? గిట్టని సామాజిక వర్గాన్ని తొక్కే ప్రయత్నం చేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్డి సామాజిక వర్గం ఐఏఎస్ అధికారులను పెద్ద ఎత్తున తప్పించింది. చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే పక్కన పెట్టేశారు. ఐపీఎస్ అధికారులకి అదే తీరు. రెడ్డి సామాజిక వర్గంపై క్షేత్రస్థాయిలో టిడిపి నాయకులు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఆ సామాజిక వర్గంలో ఒక రకమైన ఆందోళన నెలకొంది. జగన్ పై కోపంతో చంద్రబాబును గెలిపిస్తే.. పరిస్థితి ఇలా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ను కాదని చంద్రబాబుకు మద్దతు ఇచ్చినందుకు తాము ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందా? అనిల్ రెడ్డి సామాజిక వర్గం కలత చెందుతోంది.

వైసిపి ఆవిర్భావం నుంచి రెడ్డి సామాజిక వర్గం ఆ పార్టీకి అండగా నిలుస్తూ వస్తోంది. అయితే 2014 ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గం అండగా నిలిచినా.. అది రాయలసీమ వరకు మాత్రమే పరిమితమైంది. మిగతా సామాజిక వర్గాలు అప్పట్లో టిడిపి, బిజెపి కూటమికి జై కొట్టాయి. ఆపై జనసేన మద్దతు లభించడంతో ఈజీగా అధికారంలోకి వచ్చింది టిడిపి కూటమి. అయితే 2019లో మాత్రం జగన్ గెలుపు కోసం రెడ్డి సామాజిక వర్గం గట్టిగానే ఫైట్ చేసింది. జగన్ గెలుపు తమ గెలుపుగా సగటు రెడ్డి సామాజిక వర్గం వ్యక్తి భావించాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం పెట్టారు. కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి, విజయసాయిరెడ్డి, వై వి సుబ్బారెడ్డి లాంటి వారికి ప్రాధాన్యం దక్కింది. వారిని మాత్రమే జగన్ చేరదీశారు. ప్రభుత్వంలో కీలక భాగస్వాములుగా చేర్చుకున్నారు. 2019 ఎన్నికల్లో రాజకీయంగా మద్దతు ఇచ్చిన రెడ్డి సామాజిక వర్గాన్ని జగన్ అస్సలు పట్టించుకోలేదు. ఆ ప్రభావం 2024 ఎన్నికలపై పడింది.

ప్రకాశం, నెల్లూరు జిల్లాలో వైసీపీకి కంచుకోటలు. అటువంటి జిల్లాల్లో ప్రతికూల ఫలితాలు వచ్చాయి. కేవలం నేతలు పక్కకు తప్పుకోవడం వల్ల అక్కడ టిడిపి కూటమి బలపడింది. ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది. నెల్లూరులో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వేం రెడ్డి ప్రభాకర్ రెడ్డి.. ఇలా ఆ సామాజిక వర్గం నేతలంతా వైసీపీని వీడారు. టిడిపిలో చేరారు. ప్రకాశం జిల్లాలో బలమైన నేతగా ఉన్న మాగుంట శ్రీనివాసుల రెడ్డిని జగన్ వదులుకున్నారు. అక్కడ కూడా ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది. గుంటూరు జిల్లాలో టిడిపికి బలమైన నేతగా ఉన్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైసీపీలో చేరారు. కానీ ఆయనను గత ఐదేళ్లలో పట్టించుకున్న దాఖలాలు లేవు. అందుకే ఆ ప్రభావం ఈ ఎన్నికల్లో చూపారు మోదుగుల.

జగన్ వల్ల తమకు మేలు జరుగుతుందని భావించింది రెడ్డి సామాజిక వర్గం. అందుకే 2019లో వైసీపీకి అండగా నిలబడింది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ వ్యాపారాలు దెబ్బ తినడం, పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ప్రాధాన్యత లేకపోవడం.. రాజకీయంగా తమకు ఎలాంటి మద్దతు లభించకపోవడం కారణంగా చంద్రబాబు కొడుకు కిందకు వచ్చారు. అందుకే రాయలసీమలో టిడిపి కూటమికి ఏకపక్ష విజయం దక్కింది. చివరకు కడప జిల్లాలో సైతం.. పది స్థానాలకు గాను ఏడింటిని ఆ పార్టీ సొంతం చేసుకుంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్థాయిలో రెడ్డి సామాజిక వర్గానికి అండలేకుండా పోతుంది. దీంతో తామేమైనా తప్పు చేశామా? అని రెడ్డి సామాజిక వర్గం మదనపడుతోంది.

చంద్రబాబు క్యాబినెట్లో రెడ్డి సామాజిక వర్గానికి మూడు మంత్రి పదవులు దక్కాయి. అవి కూడా కీలక శాఖలు కాదు. దీంతో వారిలో ఒక రకమైన అసంతృప్తి ఉంది. అటు క్షేత్రస్థాయిలో కూడా రెడ్డి సామాజిక వర్గాన్ని పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం నడుస్తోంది. మున్ముందు ఇది ఇలానే కొనసాగితే ఆ సామాజిక వర్గం పునరాలోచనలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం కీలక అధికారులపై ఏకపక్షంగా వేటు వేశారు. దీనినే ప్రచారాస్త్రంగా వాడుతోంది వైసిపి. జగన్ హయాంలో రెడ్డి సామాజిక వర్గం ఎంతో గౌరవం పొందిందని.. చేజేతుల దానిని నాశనం చేసుకున్నారని టాక్ నడుస్తోంది. ఇటువంటి సమయంలో చంద్రబాబు జాగ్రత్తగా అడుగులు వేయకపోతే రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు తప్పవు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular