Telangana Congress Rachabanda: నూరేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ కొద్ది రోజులుగా ఆపసోపాలు పడుతోంది. ఒక్కో రాష్ట్రం జారవిడుస్తూ ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లోనే అధికారంలో నిలిచింది. చత్తీస్ గడ్, గుజరాత్ రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉండటంతో రాబోయే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది. అందుకే ప్రజల్లో పోయిన ప్రతిష్టను తీసుకొచ్చేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనికి గాను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చురుకుగా కదులుతున్నారు. దీని కోసం నేతలు కూడా అందరు ఐకమత్యంతో రచ్చబండ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు.
టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు పావులు కదుపుతోంది. వరంగల్ సభలో రైతు డిక్లరేషన్ ప్రకటించడంతో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 12 వేల పంచాయతీల్లో రచ్చబండ కార్యక్రమాల కోసం దాదాపు 400 మంది నేతలు హాజరు కానున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అక్కంపేటలో టీనీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నెదురుకూరులో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాల్గొంటారు.
కాంగ్రెస్ పార్టీ పోయిన ప్రతిష్టను ఇనుమడింపచేసుకునే ప్రయత్నంలో భాగంగా అన్ని గ్రామాల్లో నేతలు పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టనున్నారు. టీఆర్ఎస్ నేతల్లో ఉన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. నేతలు సమష్టిగా ప్రభుత్వంపై పోరు సాగించేందుకు నడుం బిగించినట్లు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు.
ప్రజల్లో పోయిన ఉనికిని తిరిగి తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్ఎస్ అసంతృప్తులకు గాలం వేస్తున్నారు. వారిని తమ పార్టీలో చేర్చుకునేందుకు అన్ని మార్గాల్లో ప్రయత్నాలు సాగిస్తోంది. పార్టీ నేతల్లో ఉన్న అంతర్గత విభేదాలను పక్కన పెట్టి పార్టీ కోసం పని చేయాల్సిన సమయం వచ్చిందని చెబుతున్నారు. ఇప్పుడు మేల్కోకపోతే ఇక పార్టీ ఎప్పటికి అధికారంలోకి రాదని సూచిస్తున్నారు. అందుకే పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలని చెబుతున్నారు.
మొత్తానికి నేటి నుంచి రచ్చబండ ద్వారా ప్రజల్లో మళ్లీ పట్టు తెచ్చుకోవాలని భావిస్తోంది. దీనికి గాను రచ్చబండను ఉపయోగించుకోవాలని చూస్తోంది. రచ్చబండను విజయవంతం చేసి ప్రజల్లో విశ్వాసం కలిగించాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికైనా నేతల్లో మార్పు వచ్చి కార్యక్రమం విజయవంతం చేస్తారో లేక మళ్లీ నిరుత్సాహ పరుస్తారో వేచి చూడాల్సిందే మరి.