KTR: తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీలో కేసీఆర్ కుటుంబ సభ్యుల్లోని మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్సీ కవిత కన్పించలేదు. పైగా హరీశ్ హుజూరాబాద్ యుద్ధంలో ఉన్నారని కేసీఆర్ ప్రకటించారు. మరీ ఎమ్మెల్సీ కవిత కవిత ప్లీనరీకి ఎందుకు రానట్లు? ఆమె జ్వరంతో బాధపడుతోందని, అందుకనే రాలేదని కవర్ చేశారు. సీన్ కట్ చేస్తే ప్లీనరీలో మంత్రి కేటీఆర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రాజ్యసభ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్లీనరీకి వచ్చిన ప్రతినిధులంతా కేటీఆర్తో ఫొటోలు దిగేందుకు ఆరాటపడ్డారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్కు పార్టీలో ఎవో రహస్య బాధ్యతలు అప్పగించారని, అందుకే క్యాడరంతా ఆయనతో పోటీపడి మరీ ఫొటోలు దిగారని తెలుస్తోంది.
ప్లీనరీలో దాదాపు 15కు పైగా వచ్చిన నామినేషన్ల అన్నింటిలోనూ సీఎం కేసీఆర్నే అధ్యక్షుడిగా ప్రతిపాదిస్తూ దాఖలు కావడం.. 9వ సారి కూడా కేసీఆర్నే అధ్యక్షుడిగా ఎన్నుకోవడం చకచకా జరిగిపోయాయి. దాంతోపాటు పార్టీ నియామవళిలో కొత్త మార్పులు చేస్తున్నట్టు ప్రకటించారు. అధ్యక్షులు స్థానికంగా లేనప్పుడు కీలకమైన నిర్ణయాలు తీసుకునే అధికారం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండేవారు తీసుకోవచ్చనే సవరణ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ సవరణ వెనుక పెద్ద అంతరార్థమే ఉన్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ ఎప్పుడూ హైదరాబాద్ కేంద్రంగా స్థానికంగానే ఉంటారు. అయినా ఈ సవరణ ఎందుకు చేసినట్టని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే కేసీఆర్ ఇక ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలను శాసించనున్నారని, అందుకే కేటీఆర్కు ఈ సవరణతో మరిన్ని బాధ్యతలు అప్పగించారని పార్టీ క్యాడర్ చర్చించుకుంటోంది.
కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక పార్టీ వ్యవహారాలన్నీ చక్కబెడుతూ వస్తున్నారు. గతంలో కంటే ఎక్కువగా పార్టీ సభ్యులపైన, కార్యకర్తలపైన ఫోకస్ పెరిగింది. అయితే ఇప్పటి వరకు కీలకమైన వ్యవహారాల్లో మాత్రం కేటీఆర్ తలదూర్చలేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనులన్నీ చక్కబెట్టిన నేపథ్యం కారణంగానే ఈ అనూహ్య బాధ్యతలు అప్పగించినట్టు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. అంతేకాక ఈటల రాజేందర్ వ్యవహారం కారణంగా మంత్రులను, ఎమ్మెల్యేలను గాడిలో పెట్టేందుకు కేటీఆర్ మరిన్ని పవర్స్ కల్పించినట్టు ఓ చర్చ నడుస్తోంది. గతంలో ఓ మంత్రి కొడుకు ఫంక్షన్లో బెంగుళూరులో జరిగిన కార్యక్రమంలో ఓ ఎమ్మెల్యే కేసీఆర్కు వ్యతిరేకంగా మాట్లాడినట్టు కేటీఆర్ దృష్టికి వచ్చిందని, ఎమ్మెల్యే తిరిగిరాగానే దీనిపై నిలదీసి మొట్టికాయలు వేసినట్టు చర్చ జరిగింది. అదెంత వరకు వాస్తవమో తెలియదుగానీ పార్టీలో ఇలాంటి క్రమశిక్షణను మీరకుండా కేటీఆర్కు మరింత ఊతమిచ్చే విధంగా నియామావళిలో మార్పులు చేసినట్టు తెలుస్తోంది.