MLC Kavitha- CBI: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ తీరు ఉత్కంఠ రేపుతోంది. ఈ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు, ఎమ్మెల్సీ కవితకు సంబంధం ఉన్నట్లు ఈడీ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఆధారాలు దొరకకుండా పది సెల్ఫోన్లు, రెండు సిమ్కార్డులు ధ్వంసం చేసినట్లు తెలిపింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ ఢిల్లీ లిక్కర్ స్కాంకు సబంధించి తనకు తెలిసిన సమాచారాన్ని తెలుసుకునేందుకు ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చింది. దీనిపై మంగళవారం సీబీఐ అధికారులకు కవిత వివరణ ఇవ్వాల్సి ఉంది.
ఫిర్యాదు కాపీ, రిమాండ్ రిపోర్టు కావాలని లేఖ..
తాను సీబీఐ విచారణకు వస్తానని, డిసెంబర్ 6న హైదరాబాద్లోని తన ఇంటికే రావాలని కవిత మొదట సీబీఐకి సమాచారం ఇచ్చారు. తర్వాత తన తండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుతో ప్రగతిభవన్లో రహస్యంగా చర్చలు జరిపారు. ఇందులో రిటైర్డు జడ్జిలు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయవాదులు కూడా పాల్గొన్నట్లు తెలిసింది. నోటీసులను వారు క్షుణ్ణంగా పరిశీలించి కవితతో మరో లేఖ రాయించారు. తనకు ఫిర్యాదు కాపీ, రిమాండ్ రిపోర్టు ఇవ్వాలని కవిత మరో లేఖను సీబీఐకి రాసింది. అవి అందిన తర్వాతనే విచారణకు వస్తానని తెలిపారు. దీనికి స్పందించిన సీబీఐ కవిత అడిగిన వివరాలన్నీ సీబీఐ వెబ్సైట్లో ఉన్నాయని, వాటిని చూసుకోవచ్చని సమాధానం ఇచ్చింది.
ఎఫ్ఐఆర్లో పేరు లేదని..
ఫిర్యాదు కాపీ, ఎఫ్ఐఆర్ పరిశీలించిన కవిత, ఆమె న్యాయ సలహాదారులు ఎఫ్ఐఆర్లో తన పేరు లేదని కవితతో మరో లేఖ రాయించారు. అయితే విచారణకు రానని మాత్రం అందులో పేర్కొనలేదు. అయితే తాను ముందుగా షెడ్యూల్ చేసుకున్న కార్యక్రమాల కారణంగా డిసెంబర్ 6వ తేదీ మంగళవారం హాజరుకాలేనని పేర్కొన్నారు. తాను విచారణకు సహకరిస్తానని, అయితే తన బిజీ షెడ్యూల్ వల్ల 6వ తేదీ కాకుండా ఈనెల 11, 12, 14, 15 తేదీల్లో ఏదో ఒక రోజు తాను అందుబాటులో ఉంటానని తెలిపారు. దీనికి సంబంధించి సీబీఐ అధికారుల నుంచి ఎలాంటి రిప్లయ్ రాలేదు.
హైదరాబాద్లో సీబీఐ అధికారులు..
ఇదిలా ఉండగా, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు విచారిస్తున్న సీబీఐ అధికారులు కవిత వివరణ తీసుకునేందుకు హైదరాబాద్ చేరుకున్నట్లు తెలుస్తోంది. అయితే కవిత లేఖపై ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాల్సి ఉంది. బుధవారం జగిత్యాలలో సీఏం కేసీఆర్ సభ ఉండటంతో.. ఆ ఏర్పాట్లను పరిశీలించేందుకు కవిత మంగళవారం జగిత్యాల వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో తన విచారణ తేదీల్లో మార్పులు చేయవల్సిందిగా కవిత సీబీఐ అధికారులను కోరారు. ఫిర్యాదు కాపీ, ఎఫ్ఐఆర్పై వెంటనే రిప్లై ఇచ్చిన సీబీఐ విచారణ తేదీ మార్పుపై స్పందించకపోవడం ఉత్కంఠ రేపుతోంది. ఇదే సమయంలో అధికారులు హైదరాబాద్కు రావడం గులాబీ నేతల్లో గుబులు పుట్టిస్తోంది. మరోవైపు ఎమ్మెల్సీ కవిత ఇంకా హైదరాబాద్లోనే ఉన్నారు. మధ్యాహ్నం తర్వాత ఆమె జగిత్యాలకు వెళ్లనున్నారు. ఇంతలో సీబీఐ ఎలాంటి స్టెప్ వేస్తుందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. కాగా, సీబీఐ అధికారులు హైదరాబాద్ వచ్చినట్లు తెలియడంతో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక పోలీసులతో కవిత ఇంటివద్ద భారీ భద్రత ఏర్పాటు చేసింది. అదే సమయంలో గులాబీ నేతలను కవిత ఇంటికి వెళ్లాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో భారీగా నేతలు కవిత ఇంటికి చేరుకుంటున్నారు. ఈ పరిణామాలతో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.