ఏపీ మున్సిపల్ ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం మొదలైంది. 151 మంది ఎమ్మెల్యేలు ఏపీ వ్యాప్తంగా ఉండడం పట్టణాలన్నీ వైసీపీ కైవసం అవుతున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపట్టారు. సాయంత్రం 6 గంటల్లోగా ఫలితాలు పూర్తికానున్నాయి.
ఏపీలో ప్రధానంగా విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం కార్పొరేషన్ల తీర్పుపైనే ఉత్కంఠ నెలకొంది. దీని మీదే జగన్ మూడు రాజధానులతోపాటు అమరావతి భవిత ఆధారపడి ఉంది. అమరావతినా? లేక మూడు రాజధానుల నిర్ణయమా? అన్నది జగన్ కు క్లియర్ కట్ మెసేజ్ ను ప్రజలు ఇవ్వనున్నారు. జగన్ నిర్ణయానికి ప్రజా మద్దతు ఉందో లేదో ఫలితాలతో తెలియనుంది.
ఏపీలోనే అతిపెద్ద మున్సిపాలిటీ అయిన విశాఖపట్నం కార్పొరేషన్ ఫలితాలు ఆలస్యం కానున్నాయి.విశాఖ లో డివిజన్ల సంఖ్య ఎక్కువ కావడంతో ఆలస్యం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.ఇక హైకోర్టు ఆదేశాలతో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఓట్ల లెక్కింపును తాత్కాలికంగా నిలిపివేశారు.
తాజా ఫలితాల ప్రకారం.. వైసీపీ 13 మున్సిపాలిటీలను గెలుచుకుంది. ఆత్మకూరు, మదనపల్లె, రాయచోటి, ఎర్రగుంట్ల, నాయుడుపేట,మాచర్ల, పిడుగురాళ్ల, సూళ్లూరుపేట, పులివెందుల, పుంగనూరు, కొవ్వూరు, డోన్, గిద్దలూరు, కనిగిరి, పలమనేరులో వైసీపీ ఘనవిజయం సాధించింది.