Chandrababu Letter : రాష్ట్రానికి సుదీర్ఘంగా పాలించిన చంద్రబాబు ప్రస్తుతం జైల్లో గడుపుతున్న సంగతి తెలిసిందే. గత 45 రోజులుగా అవినీతి కేసుల్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అటు న్యాయస్థానాల్లో సైతం ఊరట దక్కడం లేదు. అసలు చంద్రబాబును అరెస్టు చేస్తారని ఎవరు భావించలేదు. ఒకవేళ చేసినా గంటల వ్యవధిలో ఆయన బయటకు వస్తారని అంచనా వేశారు. కానీ రోజులు గడిచాయి. రోజులు కాస్తా వారాలు అయ్యాయి. నెలరోజులు అధిగమించాయి. అయినా కనుచూపుమేరలో చంద్రబాబుకు విముక్తి కలిగేలా లేదు. దీంతో టీడీపీ శ్రేణులు డీలా పడ్డాయి. అయినా సరే మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్నాయి.
అయితే చంద్రబాబు కేసు విచారణ, తుది తీర్పు నవంబర్లో వెలువడే అవకాశం ఉంది. ఈ తరుణంలో ఆయన దసరా పర్వదినాన్ని సైతం జైల్లో గడపాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో చంద్రబాబు ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. ఏపీ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. జైలు జీవితం అనేది తాత్కాలికమేనని.. త్వరలో తాను బయటకు వస్తానని చెప్పుకొచ్చారు. భావోద్వేగ ప్రకటన చేశారు “నేను జైలులో లేను….ప్రజల హృదయాల్లో ఉన్నాను.ప్రజల నుంచి నన్ను ఒక్క క్షణం కూడా ఎవ్వరూ దూరం చేయలేరు.45 ఏళ్లుగా నేను కాపాడుకుంటూ వస్తున్న విలువలు, విశ్వసనీయతని చెరిపేయలేరు. ఆలస్యమైనా న్యాయం గెలుస్తుంది..నేను త్వరలో బయటకొస్తాను.ప్రజల కోసం, రాష్ట్ర ప్రగతి కోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాను”అని చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా చంద్రబాబు తన అభిప్రాయాన్ని ప్రజల్లో పంచుకునేందుకు కీలక ప్రకటన చేశారు.’ఓటమి భయంతో జైలు గోడల మధ్య బంధించి ప్రజలకి నన్ను దూరం చేశామనుకుంటున్నారు. నేను ప్రస్తుతం ప్రజల మధ్యలో లేకపోవచ్చు. అభివృద్ధి రూపంలో ప్రతీ చోటా కనిపిస్తాను. సంక్షేమం పేరు వినిపించిన ప్రతీసారి నా పేరే తలుస్తారు. ప్రజల్నించి ఒక్క రోజు కాదు, ఒక్క క్షణం కూడా నన్ను దూరం చేయలేరు. నేను జైలులో లేను, ప్రజల హృదయాల్లో ఉన్నాను.`అంటూ తనకు ప్రజలతో ముడిపడిన అనుబంధాన్ని లేఖలో స్పష్టం చేశారు.
ప్రజలే నా కుటుంబం. జైలు గోడల మధ్య కూర్చుని ఆలోచిస్తూ ఉంటే 45 ఏళ్ల ప్రజాజీవితం నా కళ్ల ముందు కదలాడుతోంది. నా రాజకీయ ప్రస్థానమంతా తెలుగు ప్రజల అభివృద్ధి .. సంక్షేమమే లక్ష్యంగా సాగింది. దీనికి ఆ దేవుడితో పాటు మీరే సాక్ష్యం. ఓటమి భయంతో నన్ను జైలు గోడల మధ్య బంధించి ప్రజలకి దూరం చేశామనుకుంటున్నారు. నేను మీ మధ్య తిరుగుతూ ఉండకపోవచ్చు. కానీ అభివృద్ధి రూపంలో ప్రతీ చోటా కనిపిస్తూనే ఉంటాను. సంక్షేమం పేరు వినిపించిన ప్రతీసారి నేను గుర్తుకొస్తూనే ఉంటాను. ప్రజల్నించి ఒక్క రోజు కాదు కదా!, ఒక్క క్షణం కూడా నన్ను దూరం చేయలేరు. కుట్రలతో నాపై అవినీతి ముద్ర వేయాలని ప్రయత్నించారు కానీ.. నేను నమ్మిన విలువలు, విశ్వసనీయతని ఎన్నడూ చెరిపేయలేరు. ఈ చీకట్లు తాత్కాలికమే. సత్యం అనే సూర్యుడి ముందు కారుమబ్బులు వీడిపోతాయి. సంకెళ్లు నా సంకల్పాన్ని బంధించలేవు. జైలుగోడలు నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేవు. జైలు ఊచలు నన్ను ప్రజల్నించి దూరం చేయలేవు. నేను తప్పు చేయను, చేయనివ్వను. అని చంద్రబాబు స్పష్టం చేశారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో తొలిసారిగా.. జైలు నుంచి చంద్రబాబు ప్రత్యేక ప్రకటన విడుదల చేయడం బాధాకరం. కానీ టిడిపి శ్రేణుల్లో ధైర్యం నింపే ప్రయత్నంలో భాగంగా చంద్రబాబుఈ ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. అయితే అధినేత నేరుగా దసరా శుభాకాంక్షలు తెలపడంతో టిడిపి శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.