Jagan vs Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న జనసేన అధినేత పవన్కళ్యాణ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని భయపెడుతున్నారా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పవన్ కళ్యాణ్ ఇప్పటంలో ఆదివారం చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు నిదర్శనమని పేర్కొంటున్నారు. వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ఆరు నెలలుగా రాజకీయంగా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రజాసమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్నారు. మరోవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలను వచ్చే ఎన్నికల్లో ఎలా ఓడించాలని ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందిస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు దీటుగా నిలబడే అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తి చేస్తున్నారు. వైసీపీలో అసంతృప్త నేతలను జనసేనలో చేర్చుకుంటున్నారు.
-ప్రధానికి ఫిర్యాదులు..
ఆంధ్రప్రదేశ్లో జనసేనాని దూకుడు అధికార వైసీపీని కలవెరపెడుతోంది. ఇన్నాళ్లూ టీడీపీ ప్రతిపక్షంగా భావించిన అధికార పార్టీ.. ప్రస్తుతం జనసేనాని దూకుడును తట్టుకోలేకపోతోంది. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుండడం ముఖ్యమంత్రి జగన్తోపాటు అధికార వైసీపీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలను జనసేనాని టార్గెట్ చేయడం కూడా అధికార పార్టీని కలవర పెడుతోంది. దీంతో పవన్ దూకుడును అడ్డుకోలేకపోతున్న సీఎం జగన్ ప్రధాని నరేంద్రమోదీ ద్వారా జనసేనానికి కల్లెం వేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జగన్ ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి పవన్ తీరుపై ప్రధానికి ఫిర్యాదులు చేసినట్లు సమాచారం.
-ఒక్కడినే వస్తా అంటున్న పవన్..
మరోవైపు వైసీపీ కంట్లో నలుసుగా మారిన జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం వచ్చే ఎన్నికల్లో వైసీపీని కూల్చేందుకు ఒక్కడినే వస్తానని తొడగొట్టి చెబుతున్నారు. ఇందుకు కారణం వైసీపీ ప్రధానికి పదేపదే జనసేనానిపై ఫిర్యాదులు చేయడమే కారణమని విశ్లేషకులు, జనసేన పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఇటీవల విశాఖకు వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ పవన్ కళ్యాణ్తో 20 నిమిషాలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగానే ప్రధాని మోదీ వైసీపీ నేతలు, సీఎం జగన్ చేసిన ఫిర్యాదుల గురించి పవన్కు తెలిపినట్లు సమాచారం. అందుకే ఇప్పటంలో నిర్వహించిన సభలో పవన్ వైసీసీని కూల్చేందుకు తాను ఒక్కడినే వస్తానని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ‘‘మీలాగ నేను ఫిర్యాదులు చేయను’’ అని పవన్ పేర్కొనడం చూస్తుంటే వైసీపీ నేతలు, సీఎం జగన్ ప్రధానికి జనసేనపై, ఆ పార్టీ అధ్యక్షుడిపై ఫిర్యాదులు చేసి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇన్నాళ్లూ జగన్ ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి తన కేసుల విషయంపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షాతో చర్చిస్తారని, ప్రత్యేక హోదా గురించి వేడుకుంటారని అందరూ భావించారు. రాష్ట్ర అభివృద్ధి గురించి గానీ, నిధుల గురించిగానీ, అడగరని టీడీపీ, జనసేన నేతలు ఆరోపించారు. కానీ ప్రస్తుతం పవన్ చేసిన వ్యాఖ్యలు చూస్తే మాత్రం.. వైసీపీ నాయకులు జనసేనానిపై ఫిర్యాదు చేశారని స్పష్టమవుతోంది. దీనిపై అధికార వైసీపీ నేతలు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.