ABN RK : రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రజలను పట్టిపీడిస్తున్నాయి. అటువంటి వాటిపై దృష్టిపెడితే పరిష్కారమార్గం చూపించిన వారవుతాం. కానీ అటువంటి గోల్డెన్ చాన్స్ మిస్సవుతున్నారు చంద్రబాబు అండ్ కో. కేవలం వైసీపీ నేతలపై వ్యక్తిగత విమర్శలకే పరిమితం అవుతున్నారు. అటు ఎల్లో మీడియాది అదే పరిస్థితి. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాక్రిఫష్ణ వారం వారం రాసే కాలమ్ లో కేవలం ఏపీ సీఎం జగన్ కే స్పేస్ ఇస్తున్నారు. రాష్ట్రంలో సమకాలిన రాజకీయ అంశాలు కానీ.. ప్రజా సమస్యలు కానీ ఆయనకు కనిపించవు. కేవలం సీఎం జగన్ ను ఆడిపోసుకోవడం ఒక్కటే ఆయనకు తెలుసు. టీడీపీ శ్రేణులకు వినసొంపుగా వినిపించే వ్యాఖ్యలతో సాగే కాలమ్ తో వారం వారం రాధాక్రిష్ణ రెచ్చిపోతుంటారు.
వివేకా హత్య విషయంలో..
ఇటీవల ఓ కాలమ్ లో వివేకానందరెడ్డి హత్య కేసును రాధాక్రిష్ణ ప్రాధాన్యమిచ్చారు. వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజున లోటస్ పాండ్ నివాసంలో ఉదయం నాలుగున్నర గంటలకు నలుగురు ముఖ్యులతో జగన్ మేనిఫెస్టో తయారీ సమావేశం నిర్వహించారని… తన బాబాయి వివేకా మరణ వార్త ఫోన్ ద్వారా తెలిసినప్పటికీ, సమావేశానికి తిరిగి వచ్చి బాబాయి గుండెపోటుతో చనిపోయారనే సంగతిని ప్రకటించి, సమావేశం కొనసాగించారని ఆర్కే రాసుకొచ్చారు. అందులో నలుగురి పేర్లు కూడా వెల్లడించారు. ఆ నలుగురిని తక్షణం విచారిస్తే కేసు ముగింపునకు వచ్చేసినట్టేనని బదులిచ్చారు.
పచ్చి పచ్చి రాతలతో..
జగన్ విషయంలో రాధాక్రిష్ణ వాడే భాష కూడా చాలా పద్ధతిగా ఉంటుంది. పచ్చి పచ్చి రాతలతో పసుపు శ్రేణులకు బలమైన టానిక్ లా పనిచేస్తోంది. ఇదో నిఘంటువుగా భావించే పచ్చ శ్రేణులు ఆర్కే రాతలతోనే ముందుకెళతారు.అంతెందుకు ఆర్కే ఇలా రాస్తాడో లేదో తండ్రీ, కొడుకులు చంద్రబాబు, లోకేష్ రెచ్చిపోతారు. పాదయాత్రలో స్థానికంగా ప్రజల సమస్యలు మాట్లాడితే ప్రజలను ఆకట్టుకోవచ్చుననే మర్మం తెలియని చినబాబు జగన్ మీద నిందలు వేయడానికి, ఈ ఆర్కే అబద్ధాలను వాడుకుంటున్నారు. ఒకసారి ఆర్కే లజిక్ ను పరిశీలిస్తే.. వివేకానందరెడ్డి హత్య కేసులో సూత్రధారులు,పాత్రధారులు వీరే అంటూ అనుమానాలు, లాజిక్ లు బయటకు లాగి మరీ రాతలతో రక్తికట్టించారు.
ఆ ప్రాధాన్యతకు అర్థాలే వేరు..
వాస్తవానికి ఎల్లోమీడియా ప్రాధాన్యతలు మారుతుంటాయి. టీడీపీకి, చంద్రబాబుకు పనికి వస్తారన్న నాయకులకే హైప్ చేస్తారు. వారికే ప్రచారం కల్పిస్తారు. ఇక రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడడం.. అంతిమంగా టీడీపీకి లాభించాలన్నదే ధ్యేయం. అందులో భాగంగానే రాధాక్రిష్ణ వీకెండ్ కామెంట్, కొత్తపలుకు వంటి కాలమ్స్ ను రాస్తుంటారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆ నాలుగేళ్ల వ్యవధిలో జగన్ ప్రస్తావన లేకుండా ఒక్క కాలమ్ కూడా రాయలేదంటే ఏ స్థాయిలో విషభీజం నాటుకున్నారో అర్ధమవుతుంది. అలాగని జగన్ ప్రభుత్వ వైఫల్యాలు లేవని కాదు. కానీ పదేపదే ఒకే వ్యక్తిని టార్గెట్ చేసుకుంటే మాత్రం అది పలుచనైపోతోంది. జగన్ విషయంలో ఆర్కే రాతలు అలానే ఉంటున్నాయి.