Pawan Kalyan On Gaddar
Pawan Kalyan On Gaddar: పవన్ కళ్యాణ్ కు ప్రజా గాయకుడు గద్దర్ కు ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. చాలా సందర్భాల్లో గద్దర్ పవన్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పవన్ తనకు తమ్ముడి లాంటి వాడినని చెప్పుకొచ్చేవారు. ఆయన జేబులో ఉన్న డబ్బులను తీసుకునే చనువు తనకు ఉండేదని చెప్పేవారు. తాను కష్టంలో ఉంటే పాలుపంచుకునేవారని పవన్ వ్యక్తిత్వాన్ని కొనియాడేవారు. అయితే ఇవన్నీ గద్దర్ తన ఇంటర్వ్యూల్లో పంచుకున్నారే తప్ప పవన్ ఏనాడూ బయటకు వ్యక్తం చేయలేదు. గద్దర్ మరణం తర్వాతేనే ఆయనతో ఉన్న అనుబంధాన్ని పవన్ గుర్తు చేసుకున్నారు. గద్దర్ మృతదేహానికి నివాళులర్పించిన అనంతరం పవన్ కన్నీటి పర్యంతమయ్యారు. అప్పుడే పవన్ తో గద్దర్ కు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో వీడియోలు హల్చల్ చేశాయి.
అయితే వారాహి మూడో విడత యాత్రలో ఉన్న పవన్ తొలిరోజు గద్దర్ను గుర్తు చేసుకున్నారు. గద్దర్ చనిపోవడానికి వారం రోజులు ముందు తనకు ఒక మెసేజ్ పెట్టారని పవన్ గుర్తు చేశారు. రాష్ట్రంలో 60 శాతం మంది యువతకు మార్గదర్శనం చేసి విజయం సాధించాలని ఆకాంక్షించాలని పవన్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఏపీలో అదే నిజం కాబోతుందని పవన్ స్పష్టం చేశారు. అందుకే యువత కోసం, ఏపీ భవిత కోసం పోరాటానికి సిద్ధపడినట్లు పవన్ వివరించారు.
ఏపీ యువతను జగన్ దారుణంగా వంచించారని పవన్ అభిప్రాయపడ్డారు. అధికారంలోకి వస్తే రెండు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని, జాబ్ కేలండర్ ప్రకటిస్తామని, 50 వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇవన్నీ ఎక్కడ పూర్తి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. యువతను సంఘటితం చేసి వైసీపీని ఈ రాష్ట్రం నుండి పారద్రోలుతానని పవన్ స్పష్టం చేశారు. మొత్తానికైతే తనకు అత్యంత సన్నిహితుడైన గద్దర్ అభిలాషను గుర్తుచేస్తూ పవన్ యువతకు ఇచ్చిన పిలుపు చర్చనీయాంశంగా మారింది.