అధికారంలోకి వచ్చే వరకూ.. ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ విమర్శిస్తుంటాయి పార్టీలు. కానీ.. అవే పార్టీలు అధికారంలోకి వచ్చాక సేమ్ పనులను రిపీట్ చేస్తుంటాయి. సరిగా ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ సర్కార్ కూడా అలానే చేస్తోంది. ఒకప్పుడు కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీని విమర్శించిన బీజేపీ.. అచ్చం అవే పనులు చేస్తోంది. జనాల్లో మరింత విసుగు తెప్పిస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకూ, పాలనకూ సంబంధం లేకుండా మోడీ సాగుతున్నారు. 2014 ఎన్నికల ప్రాతిపదికన తీసుకుంటే.. అప్పటికీ ఇప్పటికీ సామాన్యుడి బతుకు నానాటికీ తీసికట్టుగా తయారైంది. అంతే తప్ప ఇంతవరకు మోడీ ప్రభుత్వం ఉద్ధరించిన దాఖలాలు ఏమాత్రం కనిపించడం లేదు.
Also Read: ‘పంచాయితీ’ గెలిచిన జనసేన.. మున్సిపోల్ లోనూ తొడగొడుతోంది!
కాంగ్రెస్ వాళ్లు పెట్టిన కొన్ని పథకాలే కరోనా సమయంలో కూడా జాతిని కొంత కాపాడాయి. కరోనా లాక్డౌన్ సమయంలో పట్టణాల్లో, నగరాల్లో పనులు చేసుకునే కార్మికులు సొంతూళ్ల బాట పట్టగా.. అప్పుడు వారిని కొద్దోగొప్పో అదుకున్నది వ్యవసాయ పనులు, ఉపాధి హామీ పథకమే. ఇది అందరికీ తెలిసిందే. ఇన్నేళ్ల పాలన తర్వాత కూడా చెప్పుకోవడానికి అలాంటి పని చేయలేక.. ఆఖరికి పెట్రోల్ ధరల పెంపునకు కూడా గతంలోని కాంగ్రెస్ పాలనే కారణమంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ మాట్లాడటం ఇటీవలి కాలంలో ప్రహసనంగా మారింది. జనాలు పెట్రోల్ ధరల గురించి విసుగెత్తిపోయిన దశలో ఉన్నారు. నిత్యావసరాలు సైతం ఆకాశాన్ని అంటుతున్నాయి.
ఇవన్నీ ఒక ఎత్తయితే గుజరాత్లో భారీ ఎత్తున పునర్నిర్మించిన మొతెరా ఏరియాలోని స్టేడియంకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పేరు పెట్టడం బీజేపీ చేసుకున్న సెల్ఫ్ గోల్ అని స్పష్టం అవుతోంది. ఇన్నాళ్లూ సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు చెప్పి బీజేపీ బోలెడంత రాజకీయాన్ని పండించింది. ఇప్పుడు అదే స్టేడియానికి మోడీ పేరు పెట్టండం కాంగ్రెస్కు అవకాశం ఇచ్చినట్లైంది. అయితే.. స్పోర్ట్స్ కాంప్లెక్స్కు పటేల్ పేరు అలాగే ఉందంటూ బీజేపీ వాదిస్తూ ఉంది. కానీ.. ఇంత అర్జెంటుగా నరేంద్రమోడీ స్టేడియం అంటూ నామకరణం చేయడం, బ్రేకింగ్ న్యూస్లుగా అది జాతీయ వార్తల్లో నిలవడం మాత్రం హాట్టాపిక్గా మారింది.
ఏదేమైనా.. ఇన్నాళ్లూ నెహ్రూ, ఇందిర, రాజీవ్ల పేర్ల విషయంలో తీవ్ర విమర్శలు చేసి.. ఇప్పుడు బీజేపీ అదే పని చేస్తూ ఉండటం, తమ పేర్లను తామే పెట్టేసుకుంటూ ఉండటం.. కమలం పార్టీని పలుచన చేస్తోంది. దీన్ని బత్తాయిలు ఎంతగా సమర్థించుకున్నా.. ప్రజలపై ఒక ఇంప్రెషన్ మాత్రం పడుతుంది. కాంగ్రెస్ వాళ్లు చేయలేదా? అని బీజేపీ ప్రశ్నించడమే.. ఆ పార్టీ ఫెయిల్యూర్కు చివరి మెట్టు.
Also Read: గ్రేట్ సీఎం జగన్ : ప్రభుత్వ స్కూళ్లలో సీబీఎస్ఈ సిలబస్
ఇక 2014తో పోలిస్తే.. 2019లో బీజేపీకి ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చాయి.. అనే లెక్కలు చెబుతూ, మోడీ విధానాలన్నింటినీ ప్రజలు మెచ్చుకుంటున్నారు అనే భ్రమల్లో కూడా కొందరున్నారు. అయితే.. గమనించాల్సిన అంశం ఏమిటంటే.. 2004తో పోలిస్తే 2009లో కాంగ్రెస్కు వచ్చిన ఎంపీ సీట్ల సంఖ్య చాలా ఎక్కువ. దాదాపు 50 ఎంపీ సీట్ల బలం దేశ వ్యాప్తంగా పెరిగింది. అలాంటి పార్టీ పరిస్థితి 2014 నాటికి ఏమయ్యిందో గుర్తుంచుకోవాల్సిందే. తీసుకున్న నిర్ణయాల విషయంలో వెనక్కి తగ్గే సంప్రదాయం లేని బీజేపీ ప్రభుత్వం.. ఒకసారి కొన్నింటిని అయినా సమీక్షించుకుంటే వారికే మంచిదని నిపుణుల అభిప్రాయం.
ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియానికి ఇవాళ ప్రారంభోత్సవం జరిగినా.. అహ్మదాబాద్ సిటీలో సబర్మతి నది ఒడ్డున ఉండే ఈ క్రీడా ప్రాంగణాన్ని మోతేరా స్టేడియంగా పిలుస్తున్నప్పటికీ, ఆధునికీరణ తర్వాత ‘నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం’గా మార్చడం వివాదాస్పదం అయింది. వసతుల పరంగా అత్యద్భుతంగా ఉన్నప్పటికీ, స్టేడియం పేరును మార్చేయడం ద్వారా పటేల్ను బీజేపీ అవమానించిందని గుజరాత్ కాంగ్రెస్ యువ నేత, పటేల్ రిజర్వేషన్ ఉద్యమకారుడు హార్దిక్ పటేల్ ఆరోపించారు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్