Homeఆంధ్రప్రదేశ్‌Attacks in AP : మానవత్వం మంటగలుస్తోంది : కాకిని కట్టేస్తే వందల కాకులు చేరాయి.....

Attacks in AP : మానవత్వం మంటగలుస్తోంది : కాకిని కట్టేస్తే వందల కాకులు చేరాయి.. అందరి మధ్య వ్యక్తిని నరికేస్తుంటే వీడియో తీసిన జనం

Attacks in AP :  కాకిలా కలకాలం బతుకు అవసరం లేదని చాలామంది అంటారు. కానీ తాజాగా ఓ ఘటన చూస్తుంటే కాకి లాంటి బతుకే మంచిదనిపిస్తుంది. కాకుల్లో ఉన్న ఐక్యత.. మనుషుల్లో మచ్చుకైనా కానరాలేదు. రోజుల వ్యవధిలో ఏపీలో వెలుగు చూసిన రెండు ఘటనలు ఐక్యతకు, అమానవీయతకు అద్దం పడుతున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా తాటిపాక డైలీ మార్కెట్లో ఒక కాకి అరచి విసిగిస్తోంది. చివరకు స్థానికులు ఎలాగోలా దానిని పట్టుకొని తాడుతో కట్టేశాడు. దీంతో ఆ కాకి మరింతగా అరవడం మొదలు పెట్టింది. అంతే వందల కాకులు వచ్చి అక్కడ వాలిపోయాయి. అరవడం మొదలుపెట్టాయి. కాకులు ఎవరిని ఏం చేయలేదు. కాలు కింద కూడా పెట్టలేదు. కట్టేసిన కాకిని వదిలిపెట్టే వరకు ఆ ప్రాంతంలో ఎగురుతూ గోల గోల చేశాయి. వాటి గోల స్థానిక ప్రజలు భరించలేకపోయారు. చివరకు కాకులు అనుకున్నది సాధించాయి. ఆ గోల తో చేసేదేమీ లేక కట్టేసిన కాకిని స్థానికులు విడిచిపెట్టారు. దీంతో అక్కడ నుంచి వెళ్లిపోయాయి కాకులు. ఈ ఘటనను.. వినుకొండలో జరిగిన హత్యతో పోల్చుకుంటూ.. సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతోంది. కాకుల్లో ఉన్న ఐక్యత.. మనుషుల్లో లేకుండా పోయిందే అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

పల్నాడు జిల్లా వినుకొండలో దారుణం జరిగిన సంగతి తెలిసిందే. ఒక వ్యక్తిని అతి కిరాతకంగా మరో వ్యక్తి నరుకుతూ కనిపించాడు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఇద్దరు గొడవపడ్డారు. అది వ్యక్తిగతమో.. రాజకీయమో తెలియదు గానీ.. నడిరోడ్డుపై ఒక వ్యక్తిని మరో వ్యక్తి నరుకుతుండగా జనం తిరుగుతూనే ఉన్నారు కానీ… అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అలా చేసి ఉంటే ఒక ప్రాణాన్ని కాపాడుకునేవారు. వినుకొండ వైసీపీ నేత రషీద్ పై ప్రత్యర్థి జిలాని హేయంగా దాడి చేశాడు. అందరూ చూస్తుండగానే కత్తితో విచక్షణారహితంగా నరికి చంపేశాడు. మొదట చేతులు తెగిపోయి బాధితులు ఆర్తనాదాలు చేశాడు. వదిలేయాలని ప్రాధేయపడ్డాడు. కానీ జిలాని నరుకుతూనే ఉన్నాడు. చుట్టుపక్కల ఉన్నవారు వేడుకగా చూస్తున్నారు. ఒకరుంటే భయం. కానీ పదుల సంఖ్యలో ఉన్నారు. వారించే ప్రయత్నం చేయలేదు. అడ్డుకోలేదు. నిందితుడు జిలాని అక్కడ నుంచి వెళ్లిన తరువాత స్థానికులు పరుగెత్తుకొని వెళ్లి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అప్పటికే అతడు చనిపోయాడు.

ఒకచోట కాకిని కట్టేసినందుకే వందల కాకులు వచ్చి శాంతియుత మార్గంలో ఆందోళన చేపట్టినంత పని చేశాయి. తన తోటి కాకిని విడిపించుకునే వరకు అక్కడ నుంచి కదలకుండా ఉండిపోయాయి. మరోచోట తోటి మనిషిని నరుకుతుంటే జనం వీడియో తీస్తున్నారే తప్ప రక్షించాలని ప్రయత్నం చేయలేదు. నోటితో వద్దు వద్దు అనే మాట తప్ప.. వేరే ప్రయత్నం చేయలేదు. వేడుక చూస్తున్నట్టు అక్కడే ఉండిపోయారు. అదేదో క్రైమ్ మిస్టరీ అన్నట్టు కొంతమంది ఆసక్తితో చూశారే తప్ప.. ఎలా కాపాడగలమో ఆలోచించలేదు. గతంలోఇటువంటి ప్రమాదాలు,ఘటనలు జరిగినప్పుడు తలో చేయి వేసి అడ్డుకునే ప్రయత్నం చేసేవారు. కానీ ఇప్పుడు చేతిలో ఉన్న సెల్ ఫోన్ కు పని చెబుతున్నారు. పక్కవాడు ఎలా పోతే తమకేమీ అన్నట్టు వ్యవహరిస్తున్నారు. వీడియోలు తీస్తూ.. రీల్స్ చేస్తూ కాలం వెళ్ళదీస్తున్నారు. ఆ ప్లేస్ లో తమ వారు ఉంటే ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తే మాత్రం మనిషిలో కదలిక రావడం ఖాయం. కానీ తమ వాడు కాదులే.. తమ వాడికి ఈ పరిస్థితి రాదులే అన్నట్టు ధీమాతో ఉన్నారు. ఇటువంటి ఘటనలు మానవత్వానికి మాయని మచ్చలా మారడం ఖాయం. మనకంటే జంతువులు, పక్షులు ఐక్యత చాటుకుంటున్నాయి. విజ్ఞానం పెంచుకున్న మనిషి మాత్రం.. ఆ చేతనం అవుతున్నాడు. ఒక యంత్రంలా మారుతున్నాడు. దీనికి కాలమే సమాధానం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular