CM Chandrababu
CM Chandrabab: ఏపీలో కూటమి ప్రభుత్వం జగన్ కు షాక్ ఇవ్వనుంది. అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరు అవుతారని వైసీపీ నేతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యూహం మార్చారు. అసెంబ్లీ వేదికగా జగన్ పై యుద్ధం చేయాలని డిసైడ్ అయ్యారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు నిర్ణయించారు. శ్వేత పత్రాల విడుదలకు అసెంబ్లీ వేదికగా నిర్ణయించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు నాలుగు శ్వేత పత్రాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఇసుక, విద్యుత్, పోలవరం- నీటిపారుదల రంగం, అమరావతి రాజధాని పై సీఎం చంద్రబాబు శ్వేత పత్రాలు విడుదల చేశారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మరో మూడు శ్వేత పత్రాలను అసెంబ్లీలో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో జగన్ టార్గెట్ అయ్యే అవకాశం ఉంది.
ఈ ఎన్నికల్లో వైసీపీ దారుణ పరాజయం పాలైంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. 175 నియోజకవర్గాలకు గాను 11 స్థానాలతో వైసిపి సరిపెట్టుకుంది. ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో తీవ్ర అవమానంగా భావిస్తున్నారు జగన్. ప్రతిపక్ష హోదా లేకపోవడంతో అసెంబ్లీలో ఏ స్థాయిలో అవమానిస్తారో జగన్ కు తెలుసు. అందుకే అసెంబ్లీలో అడుగు పెట్టకూడదని భావించారు. కానీ ప్రజల నుంచి విమర్శలు వస్తాయని తెలిసి వెనక్కి తగ్గారు. ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరవుతారని తాజాగా వైసీపీ నేతలు ప్రకటించారు. తనకు నిబంధనలతో పని లేకుండా మాజీ సీఎం హోదాలో ఎక్కువసేపు మాట్లాడేందుకు సమయం కావాలని జగన్ అడుగుతారు. అందుకు ప్రభుత్వం సమ్మతించే పరిస్థితి లేదు. దానిని సాకుగా తీసుకొని అసెంబ్లీని జగన్ బహిష్కరిస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో చంద్రబాబు సైతం వ్యూహం మార్చారు. ఈ సమావేశాల్లోనే జగన్ కు ఇరుకున పెట్టాలని భావిస్తున్నారు. అసెంబ్లీ వేదికగా మూడు శ్వేత పత్రాలను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఎన్నికల్లో కూటమి భారీగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చింది. అందుకు తగ్గట్టు గానేకార్యాచరణ ప్రారంభించింది. పింఛన్ మొత్తాన్ని పెంచి జూలై 1న పంపిణీ చేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసింది. భారీ డీఎస్సీని ప్రకటించింది. అయితే కొన్ని పథకాలకు సంబంధించి ఇంకా కసరత్తు చేస్తోంది. వాటికి భారీగా నిధులు అవసరం అవుతోంది. పథకాల అమలులో జాప్యం జరిగేలా పరిస్థితి ఉంది. ఈ తరుణంలో ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గత ప్రభుత్వం ఎన్ని రకాల విధ్వంసాలకు దిగిందో కళ్ళకు కట్టినట్లు చూపే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే శ్వేత పత్రాలను విడుదల చేసింది. దీంతో సంక్షేమ పథకాల అమలులో జాప్యం పై ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించేందుకు కూడా వెనుకడుగు వేస్తున్నాయి. ఈ సమయంలో అసెంబ్లీలో శ్వేత పత్రాలు విడుదల చేయడం ద్వారా జగన్ వైఫల్యాలను ఎండగట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధపడుతోంది.
వైసీపీ హయాంలో విధ్వంసానికి గురైన శాఖలను గాడిలో పెట్టేందుకు చాలా సమయం అవసరమని కూటమి ప్రజాప్రతినిధులు ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ కుప్ప కూల్చారని ఆరోపణలు చేస్తున్నారు. వాటిని గాడిలో పెట్టే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుందని చెప్పుకొస్తున్నారు. ఒక విధంగా ఇది వైసీపీని ఇరుకున పెట్టడమే. అయితే ఈ సమావేశాలకు హాజరై అసెంబ్లీని బహిష్కరించాలని వైసీపీ వ్యూహం పన్నుతున్నట్లు కూటమి ప్రభుత్వం అనుమానిస్తోంది. అందుకే జగన్ తీరును ఎండగట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే కీలకమైన మూడు శ్వేత పత్రాలను విడుదలకు అసెంబ్లీని వేదికగా మార్చారు. ఈ మూడు శ్వేత పత్రాలతో జగన్ ను ఒక ఆటాడుకోవాలని అధికారపక్షం ప్రజాప్రతినిధులు స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు. మరి ఆ ప్రయత్నాల్లో వారు ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.