Homeఆంధ్రప్రదేశ్‌Megastar Chiranjeevi: మెగాస్టార్ తో మోడీ ఏం మాట్లాడారంటే.. పోస్ట్ వైరల్

Megastar Chiranjeevi: మెగాస్టార్ తో మోడీ ఏం మాట్లాడారంటే.. పోస్ట్ వైరల్

ప్రధాని మోదీతో చిరంజీవి క్లోజ్ గా గడపడం ఇదే కొత్త కాదు. భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణకు మోడీ హాజరయ్యారు. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవికి సైతం ప్రత్యేక ఆహ్వానం వచ్చింది.

Megastar Chiranjeevi: ఏపీ ప్రభుత్వ ప్రమాణస్వీకారంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు పవన్ కళ్యాణ్. చివర్లో అటు చిరంజీవి, ఇటు పవన్ కళ్యాణ్, మధ్యలో ప్రధాని మోదీ కొద్దిసేపు అలరించారు. అందర్నీ అబ్బురపరిచారు. ప్రస్తుతం ఈ వీడియోలే సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. సీఎం గా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధానితో పాటు అతిరథ మహారధులంతా హాజరయ్యారు. సినీ పరిశ్రమ నుంచి హాజరైన చిరంజీవి, రజనీకాంత్ లకు వేదికపై ప్రత్యేకంగా చోటిచ్చారు. ప్రధాని సమక్షంలో చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులు పదవీ ప్రమాణం చేశారు. అయితే చివర్లో స్టేజ్ పై ఉన్న చిరంజీవి దగ్గరకు వచ్చిన ప్రధాని మోదీ.. మెగా బ్రదర్స్ చేతులు పట్టుకుని అభివాదం చేశారు.

అయితే ఈ అరుదైన దృశ్యాన్ని చూసి పులకించుకుపోయిన చిరంజీవి.. తమ్ముడి బుగ్గలను నిమురుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంతే ఆనందంతో ప్రధాని మోదీ కనిపించారు. ఆ సమయంలో ప్రధాని మోదీ కొన్ని వ్యాఖ్యలు చేస్తూ కనిపించారు. దీనిపై నెటిజెన్లు రకరకాలుగా ఊహించుకొనగా.. మెగాస్టార్ చిరంజీవి ఆ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ప్రధాని మోదీ ఆ సమయంలో ఏమన్నారోసోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘నాతో, తమ్ముడితో ప్రధాని నరేంద్ర మోడీ గారు వేదికపై మాట్లాడడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ ఇంటికి వచ్చినప్పటి వీడియోను ఆయన చూసినట్లు చెప్పారు. కుటుంబ సభ్యులు, ప్రత్యేకించి మా అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమ అనుబంధాలు ఆ వీడియోలో కనిపించాయని అన్నారు. ఆ దృశ్యాలు మన సంస్కృతి సాంప్రదాయాన్ని, కుటుంబ విలువలను ప్రతిబింబించాయని అభినందించారు. ఆ క్షణాలు ప్రతి అన్నదమ్ములకి ఆదర్శంగా నిలుస్తాయి అన్నారు. ప్రధాని మాతో అలా మాట్లాడడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. వారి సునిశిత దృష్టికి నా కృతజ్ఞతలు. తమ్ముడి స్వాగతం లాగే మోదీతో జరిగిన మా సంభాషణ కూడా కలకాలం గుర్తుండిపోయే ఓ అపురూప జ్ఞాపకం’అంటూ చిరంజీవి పేర్కొన్నారు.

అయితే ప్రధాని మోదీతో చిరంజీవి క్లోజ్ గా గడపడం ఇదే కొత్త కాదు. భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణకు మోడీ హాజరయ్యారు. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవికి సైతం ప్రత్యేక ఆహ్వానం వచ్చింది. అప్పుడు సీఎం గా జగన్ ఉన్నారు. ఆయన సైతం అదే వేదికపై ఉన్నారు. కానీ ప్రధాని మోదీ మాత్రం చిరంజీవితోనే చనువుగా గడిపారు. ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. పవన్ విషయంలో సైతం చనువుగా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ సోదరులు ఇద్దరు ఒకే వేదికపై ఉండడం, ఆనందోత్సవాలు జరుపుకోవడం చూసి ప్రధాని మోదీ పరవశించిపోయారు. ఆ ఇద్దరు సోదరులతో ఎంతో ఆనందాన్ని పంచుకున్నారు. ఆ వీడియోలే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా దర్శనమిస్తున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper