ఏపీలో గత నెలలో పంచాయతీ ఎన్నికలు నాలుగు దశల్లో జరిగాయి. ఇప్పటికే రిజల్ట్స్ కూడా వచ్చాయి. అయితే.. ఆ ఎన్నికల సందర్భంలో పలుచోట్ల నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులే ముందుకు రాని పరిస్థితి పలు చోట్ల ఉంది. దీంతో ఆయా పంచాయతీల్లో సర్పంచ్లు, వార్డు మెంబర్ల స్థానాలకు మరోసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం 13 జిల్లాల్లో రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. మార్చి 15న ఆయా స్థానాల్లో ఎన్నికల పోలింగ్ ఉంటుందని ఎస్ఈసీ నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
Also Read: ఓదార్పు యాత్రకు రెడీ అయిన బాబు
అప్పట్లో దాదాపుగా ఎన్నికల ప్రక్రియ పూర్తయినా పలుచోట్ల మాత్రం నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులే దొరకని పరిస్థితి తలెత్తింది. రాజకీయ వివాదాలు, ఇతరత్రా కారణాలతో కూడా అభ్యర్థులు నామినేషన్లు వేయలేదు. దీంతో అక్కడ ఎన్నికలే నిర్వహించేందుకు వీల్లేకుండా పోయింది. అలాంటి స్థానాల్లో మరోసారి ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ నిర్ణయించారు. ఆయా చోట్ల ఎన్నికలకు వీలు కల్పిస్తూ తాజాగా ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఏపీలో మరో పంచాయతీ పోరుకు రంగం సిద్ధమైంది.
ఈ నోటిఫికేషన్ ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాలో రెండు సర్పంచ్ స్థానాలకు, విశాఖ, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఒక్కో సర్పంచ్, నెల్లూరు జిల్లాలో 4, కడపలో రెండు సర్పంచ్ స్థానాలు, కర్నూలులో ఓ సర్పంచ్ స్థానానికి, అనంతపురంలో ఓ సర్పంచ్ స్థానానికి ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే 13 జిలాల్లో మొత్తం 725 వార్డు సభ్యుల స్థానాలకు ఈసారి ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఇవన్నీ గతంలో నామినేషన్లు దాఖలు కాని స్థానాలే. ఈసారి ఆయా చోట్ల ఎన్నికలను ప్రోత్సహించేందుకు జిల్లాల కలెకర్లు ప్రయత్నాలు చేయాల్సి ఉంది.
Also Read: కేసీఆర్ను వెంటాడే నీడ.. ఇలా షాకిచ్చాడేంటి?
ఈసారి పంచాయతీ ఎన్నికల ప్రక్రియ రేపు ప్రారంభం కానుంది. రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. రేపటి నుంచి ఆరో తేదీ వరకూ నామినేషన్లను స్వీకరిస్తారు. ఈ నెల 7న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఉపసంహరణకు ఈ నెల 10 వరకూ గడువు ఇచ్చారు. ఈ నెల 15న ఈ 12 పంచాయతీలు, 725 వార్డు సభ్యుల స్థానాల్లో ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ ముగియగానే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్