సుదీర్ఘకాలం తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ధర్మారెడ్డి వ్యవహరించారు. దీంతో అక్రమాలకు అడ్డాగా తిరుమల మారిపోయిందన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా వైసిపి ప్రజాప్రతినిధుల సిఫారసులకు పెద్దపీట వేశారన్న విమర్శ ఉంది. అప్పట్లో కొందరికి లబ్ధి చేకూరేందుకు టీటీడీ సిబ్బంది కూడా చూసీ చూడనట్టు వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. మరో ఫోన్ నెంబర్తో అయితే 403 సార్లు ప్రత్యేక దర్శనం టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు బుక్ చేశారని వెలుగు చూసింది. ఇంకో నెంబర్తో అయితే ఏకంగా 807 గదులు బుక్ చేశారని వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తోంది. ఓ వ్యక్తి సంవత్సరంలో 807 సార్లు తిరుమల వచ్చి ఉండడం ఎలా సాధ్యం అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అధికార వర్గాలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. రోజుకు రెండుసార్లు గదులు బుక్ చేసిన కూడా ఒక సంవత్సరంలో 807 గదులు బుక్ చేయడం అసాధ్యమని..దీని వెనుక మాఫియా ఉందని.. భారీగా అవకతవకలు చోటుచేసుకున్నాయని.. సమగ్ర దర్యాప్తు కావాలని భక్తులు కోరుతున్నారు.
వైసిపి పాలనలో తిరుమలలో అనేక అవకతవకలు వెలుగు చూశాయి. కానీ ప్రభుత్వం చూసి చూడనట్టుగా వ్యవహరించింది. ఫలితంగా అవినీతి పతాక స్థాయికి చేరుకుంది. ప్రత్యేక దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టిక్కెట్లు, గదులు.. ఇలా అన్నింటిని దళారుల చేతిలో పెట్టి బ్లాక్ లో విక్రయించేవారన్న అనుమానాలు ఉన్నాయి. గత ఏడాది 100 ఫోన్ నెంబర్లతో అధికంగా టిక్కెట్లు కేటాయించడాన్ని అధికారులు గుర్తించారు. ఆ ఫోన్ నెంబర్లు ఎవరివి?టిక్కెట్లు ఎందుకు బుక్ చేశారు?నిజంగా టిక్కెట్లు అర్హులకు అందించారా? లేకుంటే బ్లాక్ లో అమ్మేశారా? అనేది ఆరా తీసే పనిలో పడ్డారు టీటీడీ సిబ్బంది. గత వైసీపీ ప్రభుత్వంలో చేతివాటం చూపించిన దళారులతోపాటు కొందరు టీటీడీ ఉద్యోగులు ఆందోళనతో ఉన్నారు. త్వరలో వీరికి చుక్కలు కనబడడం ఖాయమని తెలుస్తోంది.