KTR- ABN RK
KTR- ABN RK: ఉద్యమ సమయంలో చేసినట్టుగా.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈనాడు మీద అటు కేసీఆర్ గానీ ఇటు కేటిఆర్ గాని ఒక్క విమర్శ చేయలేదు. ఒకరకంగా చెప్పాలంటే ఈనాడు తన సహజ శైలికి భిన్నంగా సానుకూల వాతావరణంలో వార్తలు ప్రజెంట్ చేస్తోంది.. ప్రభుత్వ పాలన బాగుంది అనే సంకేతాలు ఇస్తోంది.. అసలు ఎలా ఉండే ఈనాడు ఎలా అయిపోయింది.. అని ఒక్కసారి ఆలోచిస్తే.. దాని వెనక ఉన్న అసలు మతలబు ఏమిటో మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు.
వేమూరి రాధాకృష్ణ ఇంటర్వ్యూలో..
ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ సంస్థల ఎండి వేమూరి రాధాకృష్ణ సోమవారం రాత్రి తన చానల్లో మంత్రి కేటీఆర్ తో ఇంటర్వ్యూ నిర్వహించారు. “ఏపీలో ప్రస్తుత పరిణామాలు చూస్తున్నారు కదా” అని ఆర్కే అడిగితే. “మాకు ఆనాడు చంద్రబాబు బహుమతి ఇచ్చారు. మేము తిరిగి ఆయనకు కూడా ఇచ్చాం. మా మధ్య ఇప్పటికీ సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. మధ్యలో ఉన్నవాళ్లే ఆగం ఆగం చేస్తున్నారు” అని కేటీఆర్ బదులు ఇచ్చారు. ఈ పరంపరలో కేటీఆర్ ను ఆర్కే మరో ప్రశ్న కూడా అడిగారు.. కాకపోతే దానికి కేటీఆర్ కుండ బద్దలు కొట్టే విధంగా సమాధానం చెప్పారు. “ఆ మధ్య రామోజీరావు మార్గదర్శి కేసు, ఓటుకు నోటు కేసు తిరగతోడాలి అని కేసీఆర్ ను జగన్ అడిగారు కదా?” అని ఆర్కే ప్రశ్నిస్తే.. ” బాధలో ఉన్న వారిని బాధ పెట్టడం తెలంగాణ సంస్కృతి కాదు. రామోజీరావుకు ప్రస్తుతం 88 సంవత్సరాలు. పైగా ఆయన అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పెద్ద మనిషిని ఏదో కేసు పేరు వేధించడం సరైనది కాదు. ఆల్రెడీ చంద్రబాబు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ సమయంలో ఓటుకు నోటు కేసును తెరపైకి తీసుకురావడం కరెక్ట్ కాదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అని ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు కెసిఆర్ బదులు చెప్పారు” అని కేటీఆర్ సమాధానం ఇచ్చారు.
ఇప్పుడే ఎందుకు చెప్పారు?
వాస్తవానికి చంద్రబాబు అరెస్టుపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చాలా ప్రభావం చూపించాయి. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు చేస్తున్న నిరసనలను తెలంగాణ పోలీసులు అడ్డుకోవడం పట్ల ఒకింత ఆగ్రహం వ్యక్తం అయింది. చంద్రబాబు వ్యవహారం అక్కడి రాష్ట్రానికి సంబంధించిందని కేటీఆర్ అనడం పట్ల రాజకీయంగా పెద్ద దుమారం చెలరేగింది. అది అంతిమంగా హైదరాబాదులోని పది నియోజకవర్గాల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని ఇంటెలిజెన్స్ రిపోర్టు ఇవ్వడంతో కేటీఆర్ దానిని సరిదిద్దుకునేందుకు పలు ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగానే ఆర్కే అడిగిన ప్రశ్నలకు చంద్రబాబుకు పాజిటివ్ కోణంలో సమాధానం చెప్పారు. మొత్తానికి ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ ఇంటర్వ్యూ ద్వారా సెటిలర్ ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు