KCR : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 36 గంటలకు ముందు.. బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఓవైపు సర్వేలన్నీ… తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి ఖాయమని చెబుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వెల్లడించాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ అనూహ్య నిరణయం తీసుకున్నారు. ఫలితాలు వెలువడిన మరుసటి రోజే.. ఫలితాలతో సంబంధం లేకుండా కేబినెట్ భేటీ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సీఎంవో నుంచి ప్రకటన వెలువడింది. అయితే ఈ సమావేశం ఎజెండా ఏమిటి అన్నది మాత్రం వెల్లడించలేదు.
3న ఫలితాల ప్రకటన..
తెలంగాణలో డిసెంబర్ 3వ తేదీన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో.. రాష్ట్రమంతా ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు గులాబీ శిబిరాన్ని టెన్షన్ పెడుతున్నాయి. ఈ తరుణంలో డిసెంబర్ 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్ర సచివాలయంలో ఈ సమావేశం జరుగనుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాతి రోజు కేబినెట్ భేటీ ఏర్పాటు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఎగి్జట్పోల్స్పై ఆరా..
మరోవైపు ఎగ్జిట్ పోల్స్పై సీఎం కేసీఆర్ ఆరా తీసినట్లు తెలిసింది. ప్రగతి భవన్లో కేసీఆర్తో బీఆర్ఎస్ నేతలు సమావేశమయ్యారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై కొందరు ఆందోళన వ్యక్తం చేయగా.. కేసీఆర్ మాత్రం.. “ఎందుకు ఆగమాగం, పరేషాన్ అయితుండ్రు.. మళ్లా మనమే వస్తున్నాం.. ఈ రాష్ట్రానికి సుపరిపాలన అందించబోతున్నాం.. 2 రోజులు నిమ్మలంగా ఉండండి, మూడో తారీఖున అందరం కలిసి సంబరాలు చేసుకుందాం.” అంటూ ధీమా ఇచ్చినట్టు తెలుస్తోంది. సమావేశం అనంతరం.. ప్రగతి భవన్ నుంచి బయటకు వస్తూ.. ఆనందంతో విక్టరీ సింబల్ చూపించారు.
తెరవెనుక ధీమా దొరికిందా..
ఒకవైపు ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీఆర్ఎస్ ఓటమి ఖాయమని చెబుతుంటే.. కేసీఆర్ మాత్రమ 3వ తేదీన సంబురాలు చేసుకుందామని అనడంపైనా చర్చ జరుగుతోంది. తెరవెనుక రాజకీయాల్లో భాగంగా కాంగ్రెస్లో ఉన్న బీఆర్ఎస్ మద్దతుదారుల నుంచి భరోసా లభించిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బీజేపీతోనూ కేసీఆర్ రహస్య మంతనాలు సాగించారని సమాచారం. హంగ్ వస్తే మద్దతు ఇవ్వడానికి కమలనాథుల నుంచి హామీ వచి్చందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.