CM Revanth Reddy
CM Revanth Reddy: ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు. జగన్మోహన్రెడ్డికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. లోక్సభ సీట్లు కూడా వైసీపీ 22 నుంచి 4 స్థానాలకు పడిపోయింది. ఏపీలో టీడీపీ గెలిచిన వెంటనే తెలంగాణ సీఎం టీడీపీకి శుభాకాంక్షలు చెప్పారు. పొరుగు రాష్ట్రంలో స్నేహంగా ఉంటామని ప్రకటించారు. కానీ, వైసీపీ ఓటమి గురించి జగన్ గురించి ఏనాడు మాట్లాడలేదు. నాలుగు రోజులుగా ఢిల్లీలో ఉన్న రేవంత్.. గురువారం(జూన్ 27న) ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా ఏపీలో వైసీపీ ఓటమిపై స్పందించారు.
పాపాలే జగన్ ఓటమికి కారణం..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్.జగన్ సారథ్యంలో వైసీపీ ఓటమిపై తొలిసారిగా తెలంగాణ సీఎం రేవంత్ స్పందించారు. ఏపీ ప్రజలు జగన్కు అధికారం ఇచ్చింది పగలు తీర్చుకోవడానికి కాదన్నారు. ఈ విషయం జగన్ ఓటమిని చూసి ప్రతీ రాజకీయ నాయకుడు నేర్చుకోవాలని సూచించారు. జగన్ చేసిన పాపాలు, తప్పులే ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కారణాలని పేర్కొన్నారు. ఏపీ ప్రజలు కసితీరా ఓట్లు వేశారని వైసీపీని 11 సీట్లకు పరిమితం చేశారని తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయడానికి కాకుండా జగన్ పగ తీర్చుకోవడానికే పనిచేశారని రేవంత్ అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడను…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తాను ఎవరితోనూ రాజీ పడనని స్పష్టం చేశారు. చంద్రబాబుకు ఏపీపై ఎంత ఆసక్తి, ప్రేమ ఉంటుందో అదే ప్రేమ, నిబద్ధత తనకు తెలంగాణపై ఉంటుందని తెలిపారు.
లోటస్ పాండ్ ఎందుట కూల్చివేతలు..
ఇక హైదరాబాద్లోని జగన్ నివాసం లోటస్ పాండ్ ఎందుట నిర్మాణాల కూల్చివేతపై కూడా రేవంత్ స్పందించారు. చంద్రబాబు నాయుడు ఫోన్ చయడంతోనే తాను లోట్పాండ్ ఎదుట నిర్మాణాలు కూల్చినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. జీహెచ్ఎంసీ అధికారులు తమ విధుల్లో భాగంగానే అక్రమ నిర్మాణాలు కూల్చివేశారని తెలిపారు. తాను చంద్రబాబు కోసం పనిచేయనని స్పష్టం చేశారు. తాను ముఖ్యమంత్రి అవుతానని ఎన్నడూ అనుకోలేదని, ఆ కల నెరవేరిందని పేర్కొన్నారు. ఇప్పుడు తన ముందున్న లక్ష్యం తెలంగాణ అభివృద్ధేనని స్పష్టం చేశారు.