Telangana Elections 2023
Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ జనసేన పార్టీకి గుర్తు సమస్య వచ్చిపడింది. జనసేన పార్టీకి గుర్తింపు లేకపోవడంతో ఆ పార్టీ అభ్యర్థులకు కామన్ సింబల్ కేటాయించే అవకాశం లేదన్న ప్రచారం జరిగింది. కానీ జనేసన విజ్ఞప్తితో ఆ పార్టీ బీఫాంపై పోటీ చేస్తున్న అందరికీ కామన్ సింబల్ గాజు గ్లాస్ కేటాయించాలని ఈసీ నిర్ణయించింది. దీంతో ఇతర పార్టీల విమర్శలకు, బీజేపీలోని నేతల విమర్శలకు చెక్ పెట్టినట్లయింది.
బీజేపీకి తలనొప్పి..
అయితే ఇంతటితో సమస్య పరిష్కారం కాలేదు. అసలు సమస్య ఇక్కడే ప్రారంభమవుతోంది. జనసేన బీఫాం ఉన్న చోట్ల గాజు గ్లాస్ ఇస్తారు. లేని చోట ఆ గుర్తు ఇండిపెండెంట్లకు ఇస్తారు. అదే అసలు సమస్య. జనసేన.. ఏపీలో మాత్రమే ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందింది. తెలంగాణలో ఆ పార్టీకి ఎలాంటి గుర్తింపు లభించలేదు. దీంతో ఆ పార్టీ గుర్తు గాజుగ్లాస్ను తెలంగాణలో రిజర్వ్ చేయలేదు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రాకరం జనసేన బీఫాంపై పోటీచేసే చోట్ల అందరికీ గాజు గ్లాస్ గుర్తు కేటాయించే అవకాశం ఉంది. కానీ జనసేన పార్టీ పోటీ చేయని చోట్ల గాజు గ్లాస్ గుర్తు ఇండిపెండెంట్లకు కేటాయించే అవకాశం ఉంది. ఇది కూటమిలోని పార్టీలకు ఇబ్బందికరంగా మారుతుంది. జనసేన ఓటర్లు గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే బీజేపీకి నష్టం జరుగుుతందన్న ఆందోళన ఉంది.
గుర్తింపు పార్టీ అయితే..
జనసేన తెలంగాణలో గుర్తింపు పార్టీ అయి ఉంటే పార్టీ సింబల్ రిజర్వు చేసేవారు. కానీ గుర్తింపు లేకపోవడంతో తెలంగాణలో గాజు గ్లాసును ఫ్రీ సింబల్గా ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో జనసేన పోటీలోని నియోజకవర్గాల్లో ఆ గుర్తును ఎవరైనా కోరుకునే అవకాశం ఉంది. ఈసీ కూడా ఇండిపెండెంట్లకు కేటాయించే ఛాన్స్ ఉంది. గాజు గ్లాస్ ఫ్రీ సింబర్ అయినందున ఇతర నియోజకవర్గాల్లో ఇతరులకు కేటాయించవద్దని కోరే అవకాశం లేదు.
తిరుపతి లోక్సభలో ఓట్లు..
తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చిన జనసేన.. పోటీ చేయలేదు. కానీ ఆ ఎన్నికల్లో ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి తనకు గాజు గ్లాస్ గుర్తు కావాలని ఈసీని కోరడంతో ఆ గుర్తును కేటాయించారు. దీంతో ఆ గుర్తుకూ కొన్ని ఓట్లు పడ్డాయి. ఇప్పుడు తెలంగాణలోనూ అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని బీజేపీ టెన్షన్ పడుతోంది. సమస్య పరిష్కారానికి బీజేపీ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.