Daggubati Purandeswari
Daggubati Purandeswari: ఏపీ బీజేపీ అధ్యక్షురాలిపై వైసిపి దాడి ముమ్మరం చేసింది. బిజెపి అధ్యక్షురాలుగా నియమితులైన పురందేశ్వరి వైసీపీ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర అప్పులతో పాటు అవినీతిపై పురందేశ్వరి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ తరుణంలో వైసీపీ సైతం పురందేశ్వరిపై ఎదురు దాడి చేస్తోంది. ముఖ్యంగా విజయసాయిరెడ్డి ఆమెను టార్గెట్ చేసుకున్నారు. పురందేశ్వరి గురించి తాను నోరు తెరిస్తే.. ఆమె తల ఎక్కడ పెట్టుకుంటారో.. ఏం చేసుకుంటారో అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.అందుకు తగ్గట్టుగానే రోజుకో ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు అవి చర్చనీయాంశంగా మారాయి.
బిజెపిలో చేరిన పురందేశ్వరి ఆ మధ్య ఎయిర్ ఇండియా ఇండిపెండెంట్ డైరెక్టర్ గా ఓ పదవి చేపట్టారు. ఆ విమానయాన సంస్థ అమ్మకంలో పురందేశ్వరి మధ్యవర్తిగా వ్యవహరించారని.. భారీగా ముడుపులు తీసుకున్నారని విజయసాయిరెడ్డి తాజాగా ఆరోపించారు.దీనిపై విజయసాయిరెడ్డి ఒక చర్చను తెర లేపారు. అయితే దీని వెనుక బిజెపి నేతలు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. బిజెపి నేతలు ఇచ్చిన సమాచారం తోనే విజయసాయిరెడ్డి ఈ ఆరోపణలు చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఇంతవరకు పురందేశ్వరి ఆ పదవి చేపట్టినట్లు ఎవరికీ తెలియదు. కానీ విజయసాయిరెడ్డి తాజాగా చేసిన ఆరోపణలతో ఆమె ఆ పదవి చేపట్టినట్లు అందరికీ తెలిసింది. అయితే ఈ ఆరోపణల్లో నిజం ఎంత అన్నది తెలియాల్సి ఉంది.
ఇటీవల పురందేశ్వరి ఏపీ మద్యం విధానం పై, మద్యం కుంభకోణం పై మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై సైతం విజయ్ సాయి రెడ్డి సరికొత్త ఆరోపణలు చేశారు. మీ భర్త వెంకటేశ్వరరావు, కుమారుడు హితేష్, గీతం భరత్ మద్యం సిండికేట్ బ్రోకర్లతో బేరాలాడి ముడుపులు తీసుకున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఖరీదైన జిల్లాను ఎలా నిర్మిస్తున్నారని? దానికి ఖర్చు పెడుతున్నది ఎవరని ప్రశ్నించారు.దీంతో ఈ వివాదం మరింత పెరుగుతోంది. దీనిపై పురందేశ్వరి ఎలా స్పందిస్తారో చూడాలి.
బిజెపి పెద్దలతో విజయసాయిరెడ్డికి మంచి సంబంధాలే ఉన్నాయి. అటువంటి వ్యక్తి ఏపీ రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలిపై నేరుగా ఆరోపణలు చేస్తుండడం విశేషం. ఇంత చేస్తున్న విజయసాయిరెడ్డి కేంద్ర పెద్దలకు సైతం ఫిర్యాదు చేసి ఉంటారని తెలుస్తోంది. అయితే వైసీపీ సర్కార్ పై పురందేశ్వరి దూకుడును కట్టడి చేయాలన్న లక్ష్యంతోనే విజయసాయిరెడ్డి ఈతరహా ఆరోపణలకు దిగారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నేరుగా తమ పార్టీ అధ్యక్షురాలు పైనే వైసీపీ నేత ఆరోపణలు చేసినా.. తోటి బిజెపి నాయకులు నోరు మెదపకపోవడం విశేషం. బిజెపిలోని ఓపక్షం విజయ్ సాయి రెడ్డికి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తోందని.. దాని ఫలితంగానే ఆయన ఈ తరహా ఆరోపణలు చేయగలుగుతున్నారని టాక్ నడుస్తోంది. మొత్తానికైతే బిజెపి కేంద్ర పెద్దల విషయంలో ఒకలా వ్యవహరిస్తున్న విజయసాయిరెడ్డి.. ఇక్కడ మాత్రం పురందేశ్వరిని టార్గెట్ చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.