ప్రధాని నరేంద్రమోడీ బయటపడ్డాడు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ ఇటీవల కేంద్రం నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ లోనూ ప్రతిపాదించింది. దీనిపై దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు సహా ప్రజలు ఆందోళన చేశారు. ఏపీలోని విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఇక్కడ కూడా పెద్ద ఉద్యమం సాగింది. రాజకీయ విమర్శలకు కారణమైంది.
ఈ క్రమంలోనే తాజాగా ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వారసత్వంగా వస్తున్నాయన్న పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను నడపలేమని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. వాటి ఆర్థిక పరిపుష్టికి ఆర్థికసాయం చేయడం ప్రభుత్వానికి భారమని వ్యాఖ్యానించారు. నష్టాల్లో ఉన్న అనేక ప్రభుత్వరంగ సంస్థలు ప్రజాధనంతో నడుస్తున్నాయని చెప్పారు.
ఇక మరో సంచలన ప్రకటన చేశారు. నాలుగు వ్యూహాత్మక రంగాలు మినహా అన్ని రంగాల ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మోడీ కుండబద్దలు కొట్టారు.
వ్యాపారం అనేది ప్రభుత్వ వ్యవహారం కాదని మోడీ మరోసారి స్పష్టం చేశారు. వ్యాపార రంగానికి ప్రభుత్వం తనవంతు తోడ్పాటునందిస్తుందని చెప్పారు. ప్రభుత్వమే స్వయంగా వ్యాపారం చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం అని వివరించాడు.
ప్రభుత్వం వైదొలిగే రంగాలను ప్రైవేటు రంగం భర్తీ చేస్తుందని మోడీ స్పష్టం చేశారు. ప్రైవేటు రంగం పెట్టుబడులు, అత్తుత్తమ విధానాలను తెస్తుందని వివరించారు. వారసత్వంగా వస్తున్నాయన్న కారణంతో ప్రభుత్వ రంగ సంస్థలను నడపలేమని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. దీన్ని బట్టి దేశంలో ప్రైవేటీకరణ తప్పదని మరోసారి మోడీ స్పష్టం చేసినట్టు అయ్యింది. దీన్ని బట్టి ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కూడా తప్పదన్న సంకేతాలు వెలువడ్డాయి.