Times Now Survey AP
Times Now Survey AP: వార్తను వార్తలాగా రాయాలి. జనాలకు కూడా అదే చూపించాలి. అప్పుడే పత్రికలపైన ప్రజలకు నమ్మకం కలుగుతుంది. నాలుగోస్తంభం పై గౌరవం ఏర్పడుతుంది. అలా కాకుండా ఓ కులానికో, పార్టీకో బాకా ఊదితేనే జనానికి ఏవగింపు కలుగుతుంది. మీడియా పై నమ్మకం పోతుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే దేశం, రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులపై, వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే విషయంపై ప్రఖ్యాత ఇంగ్లీష్ న్యూస్ చానెల్ ‘టైమ్స్ నౌ’ ఓ సర్వే చేసింది. ఈ సర్వేలో కేంద్రంలో ఉన్న బీజేపీ, తెలంగాణలో బీఆర్ఎస్, ఆంధప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ మళ్లీ అధికారాన్ని దక్కించుకుంటాయని చెప్పేసేంది. ఏపీలో వైఎస్ఆర్సీపీకి ఏకంగా 24 ఎంపీ సీట్లు వస్తాయని చెప్సేసింది. గత ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు సాధించిన టీడీపీ ఈసారి ఒక్క ఎంపీ సీటుతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందని అభిప్రాయపడింది. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 50 శాతం ఓటు షేరింగ్ రాగా, ఈసారి అది 51శాతానికి పెరుగుతుందని స్పష్టం చేసింది. ఇదే దశలో గతంలో సాధించిన 30 శాతం ఓటు బ్యాంక్ నుంచి 24 శాతానికి టీడీపీ పడిపోతుందని పేర్కొన్నది. కేంద్రంలో బీజేపీ 325 వరకు ఎంపీ సీట్లు సాధిస్తుందని పేర్కొన్నది.
వాస్తవానికి పైన చెప్పిన టైమ్స్ నౌ సర్వే వివరాలు శనివారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. టైమ్స్ నౌ అనేది దేశంలో ప్రఖ్యాత మీడియా సంస్థ. మరీ తీసి పారేయదగ్గది కాదు. కానీ ఈ విషయాలను వార్త రూపంలో తెలుగు పాఠకులకు అందించడంలో ఆ రెండు పత్రికలు(ఈనాడు, ఆంధ్రజ్యోతి) ఎందుకనో ఆసక్తి చూపలేదు. అప్పట్లో ఏదో ఆత్మసాక్షి అనే సర్వే సంస్థ తెలిపిన వివరాల ప్రకారం టీడీపీ మళ్లీ అఽధికారంలోకి వస్తుందని చెబితే కళ్లకు అద్దుకుని ఈనాడు, ఆంధ్రజ్యోతి తాటికాయంత అక్షరాలతో అచ్చసాయి. చూశారా మా బాబు మళ్లీ అధికారంలోకి వస్తున్నాడు. ఏమోయ్ జగన్ ఈ నీ పని అయిపోయింది. నీకు మళ్లీ చంచల్ గూడ జైలే గతి అనే రేంజ్లో బెదిరించాయి. కానీ అదే ఈనాడు, ఆంధ్రజ్యోతి టైమ్స్ నౌ సర్వే విషయాలను మాత్రం ప్రచురించడంలో ఏమాత్రం ఆసక్తి చూపలేదు. పైకి చూస్తే మీడియా స్వేచ్ఛ, విలువలు, నాలుగో స్తంభం అంటూ వల్లె వేసే ఈనాడు, ఆంధ్రజ్యోతి.. కనీసం ఆ సర్వే వివరాలు రాయకుండా జాగ్రత్త పడ్డాయి. అంటే అవి రాయకుండా ఆపితే ఆగే రోజులా ఇవి?
ప్రజాస్వామ్యంలో ఎవరు అధికారంలో ఉన్నా వారి వార్తలు రాయడం మీడియా విధి. వార్తలు రాయాలి, వార్తా విశ్లేషణలనూ ప్రచురించాలి. ప్రభుత్వ పరంగా తప్పు జరిగితే ప్రశ్నించాలి. చర్నాకోల్ దెబ్బల్లాగా వార్తలు ఉండాలి. ఇలా పత్రికలు వ్యవహరించాయి కాబట్టే ఒకప్పుడు జనాలకు పాత్రికేయం మీద ఆసక్తి ఉండేది. పాత్రికేయులపై గౌరవం ఉండేది. కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలను మించిపోయి రాతలు రాస్తుంటే దాన్ని ఏమనుకోవాలి? ఒక పార్టీకి ఊడిగం చేస్తూ మిగతా పార్టీలను తులనాడుతుంటే ఆ పాత్రికేయానికి ఏం పేరు పెట్టాలి? ఇందులో జగన్ పత్రిక సాక్షిని చేర్చలేం.. ఎందుకంటే ఆల్రెడీ ఆ పత్రికకు రాజకీయ రంగు ఉంది. పైగా దాని మాస్టర్ హెడ్ పక్కనే తన తండ్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ఫొటో ఉంటుంది. కాబట్టి దాన్ని తప్పు పట్టాల్సిన పని లేదు. పైగా అది టీడీపీ వార్తలు కూడా కవర్ చేస్తుంది. కానీ ఈనాడు, ఆంధ్రజ్యోతి అలా కాదు.. కేవలం చంద్రబాబు కోసమే పని చేస్తున్నట్టు వార్తలు రాస్తున్నాయి. బాబుకు అనుకూలంగా లేకపోతే వాటిని కనీసం పరిగణనలోకి కూడా తీసుకోవడం లేదు. అందుకే జనం ఆ పేపర్లు చదివేందుకు ఇష్టపడటం లేదు. ఆఫ్ కోర్స్ మిగతా పేపర్లు సుద్దపూసలని కాదు.