రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరనే నానుడి ఉంది. ఇది చాలాసార్లు నిరూపితమైంది. తెల్లరిలేస్తే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే పార్టీలు సైతం కూటమిగా ఏర్పడి పోటీచేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. తాజాగా సీఎం కేసీఆర్ పై ప్రజాయుద్ధ నౌక గద్దర్ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆయన కూడా రాజకీయాలను బాగా ఒంటపట్టించుకున్నట్లు కన్పిస్తోంది.
Also Read: గ్రేటర్ ఫైట్: అభాసుపాలైన పవన్.. ఈ ముక్క ముందే చెప్పొచ్చుగా..?
తెలంగాణలో దొరల పెత్తనం.. పాలకుల నియంతృత్వ విధానాలను నిరసిస్తూ గద్దరన్న ఎన్నో విప్లవ గీతాలను అలపించారు. తెలంగాణ ఉద్యమాన్ని తన గళంతో ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేశారు. తొలి నుంచి కేసీఆర్.. ఆయన ప్రభుత్వ విధానాలపై పోరాడిన గద్దరన్న ప్రస్తుతం ప్లేట్ ఫిరాయించినట్లు కన్పిస్తోంది.
తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల వేడిరాజుకుంది. ప్రధాన పార్టీల మధ్య పోటీ హోరాహోరీ పోటీ జరిగేలా కన్పిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వెంకటాపురం డివిజన్ ఇన్చార్జ్.. మంత్రి కొప్పుల ఈశ్వర్ అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న గద్దర్ను తాజాగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా గద్దర్ కేసీఆర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి.
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు గొప్ప ప్రజా నాయకుడని.. పాలనాధక్షుడని గద్దర్ కొనియాడారు. దేశ రాజకీయాల రూపురేఖలను మార్చాల్సిన అవసరం ఉందని.. ఈనేపథ్యంలోనే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని ప్రకటించిన కేసీఆర్ పాలనను గద్దర్ ప్రశంసించారు. ఈ ఫ్రంట్కు అనుబంధంగా కల్చరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తే తాను సంపూర్ణ మద్దతు ప్రకటిస్తానని గద్దర్ తెలుపడం గమనార్హం.
Also Read: గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ ‘సోషల్’ వార్
కేసీఆర్తో కలిసి ముందుకు సాగాలనే గద్దర్ తన మనోగతాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ తో పంచుకున్నాడు. అలాగే టీఆర్ఎస్ కార్పొరేటర్గా పోటీచేస్తున్న సబితా కిషోర్ను గద్దర్ ఆశీర్వదించాడు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్కు వ్యతిరేక కూటమి కట్టిన గద్దర్ తాజాగా కేసీఆర్ పాలనను పొగగడం విడ్డూరంగా మారింది. గద్దర్ మాటలు విప్లవాభిమానులకు షాక్ లా తగిలాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్