Chandrababu And KCR: హైదరాబాద్ : బలమైన ఆకాంక్షతో ఏర్పడింది తెలంగాణ రాష్ట్రం. ఆంధ్ర నుంచి తమను వేరు చేయాలని రాష్ట్ర ప్రజలు బలంగా కోరుకోవడంతో రాష్ట్ర విభజన జరిగింది. తెలంగాణ కొత్త రాష్ట్రం అవతరించింది. ఇటు నవ్యాంధ్రప్రదేశ్ సైతం ఏర్పడింది. ఎవరికివారుగా తమ రాష్ట్రాలను పాలించుకుంటున్నారు. ఉద్యమ తెలంగాణ నుంచి బంగారు తెలంగాణ గా మార్చుకుందామని కెసిఆర్ సైతం నాడు చెప్పుకొచ్చారు. తెలంగాణ ఉద్యమంలో పని చేయని వారిని సైతం తన పార్టీలోకి రప్పించి పాలనా బాధ్యతలు అప్పగించారు కేసీఆర్. అటువంటి కెసిఆర్ ఇప్పుడు మాట మార్చారు. అధికారం దూరం కావడంతో మరోసారి సెంటిమెంట్ వస్త్రాన్ని బయటకు తీస్తున్నారు. చంద్రబాబుపై అసూయ, ద్వేషంతో రగిలిపోతున్నారు.
* దశాబ్ద కాలం దాటుతున్నా..
తెలుగు రాష్ట్రాల విభజన జరిగి పది సంవత్సరాలు అవుతోంది. కానీ ఇంతవరకు విభజన సమస్యల పరిష్కారం కాలేదు. గత ఐదు సంవత్సరాలుగా ఏపీలో జగన్, తెలంగాణలో కెసిఆర్ అధికారంలో ఉన్నారు. కానీ రాష్ట్రాల ప్రయోజనాల కంటే.. రాజకీయ ప్రయోజనాలకి పెద్దపీట వేశారు. కనీసం విభజన సమస్యల పరిష్కారానికి కూడా చొరవ చూపలేదు. పెద్దన్న పాత్ర పోషిస్తానన్న కెసిఆర్ గత ఐదేళ్లుగా వైసీపీ జెండాకు కాపు కాశారు. జగన్ తో లోపాయి కారి ఒప్పందం చేసుకున్నారు. దీంతో విభజన సమస్యలు పరిష్కారం కాలేదు కదా.. జఠిలం అయ్యాయి. ఇప్పుడు సహృద్భావ వాతావరణంలో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అయితే.. చంద్రబాబుపై తెలంగాణ ప్రజల్లో ద్వేషం పెంచేందుకు మరోసారి సెంటిమెంట్ వస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు బిఆర్ఎస్ నేతలు.
* నాడు విలన్ గా చూపడంలో సక్సెస్..
తెలంగాణ సమాజంలో చంద్రబాబును విలన్ గా చూపించడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. అయితే ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రజల మనసు మారింది. కెసిఆర్ ను అధికారానికి దూరం చేశారు. సెంటిమెంటును పట్టించుకోకుండా.. వాస్తవాలను గుర్తించే పనిలో పడ్డారు. సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాదులో అడుగుపెట్టిన చంద్రబాబుకు టిడిపి శ్రేణులు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రెడ్ కార్పెట్ పరచడంతో తట్టుకోలేక పోతున్నారు బిఆర్ఎస్ శ్రేణులు. ఏపీ నాయకుల పెత్తనం తెలంగాణలో అవసరమా? ఏపీ పార్టీలు తెలంగాణలో రాజకీయాలు మొదలు పెడుతున్నాయి. పెళ్లి ఏపీలో జరిగితే పందిర తెలంగాణలో వేస్తున్నారు అంటూ కొత్త ప్రచారాన్ని మొదలుపెట్టారు. వాస్తవానికి రాజకీయ పార్టీలుగా భిన్నాభిప్రాయాలు ఉన్నా.. రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సామరస్య వాతావరణం అత్యంత కీలకం. గత పది సంవత్సరాలుగా విభిన్న రాజకీయ పరిస్థితులు వల్ల విభజన సమస్యలకు పరిష్కారం దొరకలేదు. ఇప్పుడు పరిష్కరించేందుకు ఛాన్స్ రాగా.. దానిపై కూడా విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. అసలు బిఆర్ఎస్ అసూయ చూస్తుంటే.. మళ్లీ తెలంగాణలో టిడిపి బలపడుతుందన్న బెంగ కనిపిస్తోంది.
* రిటర్న్ గిఫ్ట్ కు బదులు..
2019 ఎన్నికల్లో రిటర్న్ గిఫ్ట్ అంటూ హడావిడి చేశారు కేసీఆర్. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి టిడిపి పోటీ చేసింది కనుక.. 2019లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని బాహటంగానే ప్రకటించారు. కానీ 2023 తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీకి పరోక్ష మద్దతు తెలిపారు. తద్వారా తెలంగాణ నుంచి బిఆర్ఎస్ పునాదులు కదిలించినంత పని చేశారు.ఆ బాధ, ఆక్రోషంతో ఉన్న గులాబీ దళం.. ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య వాతావరణంలో కల్పిస్తున్న చంద్రబాబుపై దుష్ప్రచారం చేయడం ప్రారంభించింది. జాతీయ పార్టీగా మార్చి ఏపీని సైతం ఏలుదామని బయలుదేరారు కెసిఆర్. ఏపీలో పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. అయినా ఎన్నడు నోరు తెరవలేదు చంద్రబాబు. టిడిపి శ్రేణుల సైతం ఎటువంటి కామెంట్స్ చేయలేదు. కానీ తెలుగు ప్రభుత్వాలపరంగా బాధ్యతగా.. సీఎంలు సమావేశం అయితే తట్టుకోలేకపోతున్నారు. మళ్లీ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. కానీ అటువంటివి నమ్మే స్థితిలో తెలుగు ప్రజలు లేరన్న విషయాన్ని గ్రహించలేకపోతున్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More