దుబ్బాక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న అధికార టీఆర్ఎస్ కు అక్కడ బలమైన బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కంట్లో నలుసుగా మారారన్న చర్చ సాగుతోంది. దుబ్బాక బరిలో బీజేపీ తరుఫున నిలుచున్న రఘునందన్ రావును ఆర్థికంగా దెబ్బకొట్టే ప్లాన్ ను టీఆర్ఎస్ చేస్తోందని బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
Also Read: ప్రభుత్వం బంపర్ ఆఫర్.. పెళ్లి చేసుకుంటే నాలుగు లక్షలు..!
ఇప్పటికే 50 లక్షల వరకు రఘునందన్ రావు పీఏ దుబ్బాకకు తరలిస్తుండగా హైదరాబాద్ శివారులో పోలీసులు పట్టుకోవడం అప్పట్లో సంచలనమైంది. తాజాగా దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బంధువుల ఇళ్లలో పోలీసులు, రెవెన్యూ అధికారులు మూకుమ్మడిగా దాడులు చేయడం కలకలం రేపింది. ఇది టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారి ఉద్రిక్తతకు దారితీసింది.
రఘునందన్ రావు మామ రాంగోపాల్ రావు, మరో బంధువు అంజన్ రావు ఇళ్లలో అధికారులు సోమవారం సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. ఈ సోదాల్లో అంజన్ రావు ఇంట్లో అధికారులకు రూ.18.67 లక్షలు లభించాయి.
ఈ సమాచారం తెలియగానే బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు, బీజేపీ నేతలు పెద్ద ఎత్తున అంజన్ రావు ఇంటికి చేరుకొని పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు తీవ్ర తోపులాట కూడా జరిగింది.
ఈ తోపులాటలో రఘునందన్ రావు సొమ్మసిల్లి కిందపడిపోయాడు. అధికారులు స్వాధీనం చేసుకున్న నగదులో కొంత మొత్తాన్ని బీజేపీ శ్రేణులు లాక్కెళ్లాయి.
Also Read: నువ్వొక చెత్త ప్రోడక్ట్ అంటూ సీఎం మీద స్టార్ హీరోయిన్ చిందులు
ప్రస్తుతం అంజన్ రావు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. టీఆర్ఎస్ కు చెందిన సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు ఇంట్లోనూ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఇలా తమ చేతికి మట్టి అంటకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ బీజేపీని దెబ్బకొట్టే ప్రయత్నాలు చేస్తోందని.. టీఆర్ఎస్ నేత ఇంట్లో తూతూ మంత్రంగా సోదాలు చేశారని బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి