Pawan kalyan BJP: జనసేనాని పవన్ కళ్యాణ్ అమావాస్య, పౌర్ణమి చంద్రుడు అన్నట్టు నెలకోసారి మాత్రమే మెరుస్తాడనే విమర్శ రాజకీయవర్గాల్లో ఉంది.. ఏదో ఒక సమస్యపై సీరియస్ వ్యాఖ్యలునో.. ధర్నానో.. నిరసనో చేసి ఆ తర్వాత సైలెంట్ అవుతుంటారు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వంపై సినిమా టిక్కెట్ల ఆన్ లైన్ వ్యవహారంలో ఒంటికాలిపై లేచి విమర్శలు, ప్రతివిమర్శలతో పవన్ చెలరేగిపోయారు. వైసీపీకి గట్టి హెచ్చరికలు పంపారు.
ఆ తర్వాత చాలా రోజులు సైలెంట్ అయ్యారు. వైసీపీ ఆన్ లైన్ టిక్కెట్ల విధానాన్ని ప్రశ్నించాక పవన్ ఇప్పటిదాకా స్పందించలేదు. ఎట్టకేలకు మరో సారి జనంలోకి వస్తున్నారు. విశాఖ పరిరక్షణకు మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్ తాజాగా ఆ ఉద్యమాన్ని ఉరకలెత్తించాలని డిసైడ్ అయ్యారు. విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించుకోవాలని 300 రోజులుగా కార్మికులు చేస్తున్న పోరాటానికి సంఘాభావంగా పవన్ కదలివస్తున్నారు. ఈనెల 12న పవన్ కళ్యాణ్ దీక్షలో పాల్గొంటున్నారు.
ఇక పవన్ విశాఖలో కూర్చుంటే జనసైనికులు రాష్ట్రమంతా నిరసనలో పాల్గొనేలా ప్లాన్ చేశారు. జనసేనలో నంబర్ 2 అయిన నాదెండ్ల మనోహర్ , పార్టీ నేతలు అమరావతిలోని మంగళగిరి రాష్ట్ర కార్యాలయంలో నిరసన దీక్షలో కూర్చుంటారు.
అయితే ఈ నిరసన వైసీపీని విమర్శించడానికి పవన్ కళ్యాణ్ పెట్టుకున్నా సరే.. కానీ ఇది అంతిమంగా ప్రైవేటీకరిస్తున్న జనసేన మిత్రుడు బీజేపీనే ఇరకాటంలో నెట్టనుంది. బీజేపీ పెద్దలకు పవన్ పోరాటంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడనుంది. బీజేపీతో స్నేహం చేస్తూ ఆ పార్టీ చేస్తున్న ప్రైవేటీకరణపైనే పవన్ నిరసన దీక్ష చేయడం ఎలా సమర్థించుకోవాలో తెలియక ఇప్పుడు బీజేపీ, జనసేన నేతలు సైతం తలలు పట్టుకుంటున్నారు. పవన్ మరి విశాఖ వేదికగా ఏం చెబుతారన్నది వేచిచూద్దాం.