Telangana BJP- Congress: తెలంగాణలో ముందస్తు ఎన్నిల ఊహాగానాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్నవారు, సొంత పార్టీలో టికెట్ రాదని భావిస్తున్నవారు పక్కచూపులు చూస్తున్నారు. పార్టీలు మారేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ నుంచి వసలు షురూ అయ్యాయి. అయితే చేరికల కోసం ఎదురు చూస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎవరు వచ్చినా చేర్చుకునేందుక సిద్ధంగా ఉన్నాయి. గతంలో బీజేపీలో చేరికలు జరుగగా ప్రస్తుతం ఆగిపోయాయి. ఇప్పుడు కాంగ్రెస్లోకి వలసలు పెరుగుతున్నా.. ఆ పార్టీలో మాత్రం జోష్ కనిపించడం లేదు.
టికెట్ హామీ ఇవ్వని కమలం నేతలు..
తెలంగాణలలో బీజేపీ దూకుడుపై ఉంది. బండి సంజయ్ సారథ్యంలో పార్టీలో జోష్ పెరిగింది. ఈయన సారథ్యంలో జరిగిన దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడం, జీహె చ్ఎంసీ ఎన్నికల్లో మంచి ఫలితాలు రావడం, అధికార టీఆర్ఎస్కు ముచ్చెమటలు పట్టించడం పార్టీ కేడర్లో ఉత్సాహం నింపాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండు విడతల్లో చేపట్టిన పాదయాత్ర క్షేత్రస్థాయి క్యాడర్లో విశ్వాసం పెంచింది. దీంతో అడపాదడపా చేరికలు కూడా జరిగాయి. పార్టీ జాతీయ అధ్యక్షడు నడ్డా, హోం మంత్రి అమిత్షా, ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల రాష్ట్రానికి కూడా వచ్చారు. అయినా బడా నేతల చేరికలు జరుగడం లేదు. హుజూరాబాద్ ఎన్నికల తర్వాత భారీగా చేరికలుంటాయని బీజేపీ నేతలే చెప్పారు. కానీ అది జరుగడం లేదు. కారణం పార్టీలోకి రావాలనుకునే వారికి కమలం నేతల నుంచి స్పష్టమైన హామీ దక్కడం లేదని తెలిసింది. ఎమ్మెల్యే టికెట్, పార్టీలో కీలక బాధ్యతలపై అధిష్టానం ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. దీంతో పార్టీలో చేరాలని ఉన్నా.. టికెట్, పదవులపై స్పష్టత లేకపోవడంతో చాలామంది ఇంకా వేచిచూసే ధోరణే అవలంబిస్తున్నట్లు సమాచారం.
Also Read: Bandi Sanjay: ఇలా చేస్తే బండి సంజయ్ భద్రతకు ముప్పే
కాంగ్రెస్లో పెరుగుతున్న చేరికలు..
ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరికలు పెరుగుతున్నాయి. రేవంత్రెడ్డి పీసీసీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ కేడర్లో జోష్ వచ్చింది. రేవంత్ చేపడుతున్న కార్యక్రమాలు, నిర్వహిస్తున్న సభలు, సమావేశాలు, ప్రజల సమస్యలపై చేస్తున్న పోరాటాలు క్షేత్రస్థాయి నేతల్లో జోష్ పెంచుతున్నాయి. దీంతో అధికార పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వలసలు మొదలయ్యాయి. మూడు నెలల క్రితం చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన సతీమని, మంచిర్యాల జెడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి టీఆర్ఎస్కు గుడ్బై చెప్పి కాంగ్రెస్లో చేరారు. ఆ తర్వాత కొంతమంది చిన్నచిన్న నాయకులు కూడా కాంగ్రెస్ గూటికి వచ్చారు. ఇటీవల జీహెచ్ఎంసీ కార్పొరేటర్, క్రాంగెస్ సీనియర్ నేత పీజేఆర్ కూతురు విజయారెడ్డి కూడా టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరారు. తాజాగా ఖమ్మం జిల్లాకు చెందిన అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, కరకగూడెం జెడ్పీటీసీ కాంతారావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అధికార పార్టీలో పదవిలో ఉండి కూడా పార్టీని వీడడం టీఆర్ఎస్లో ఆందోళన కలిగిస్తుండగా, కాంగ్రెస్లో మాత్రం జోష్ పెంచలేకపోతోంది.
చేరికలపై సీనియర్ల అసంతృప్తి..
కాంగ్రెస్లో చేరికలపై బహిరంగ ప్రకటనలు, పార్టీలో అంతర్గత చర్చ జరుగకుండానే జరుగుతుండడంపై సీనియర్లు గుర్రుగా ఉన్నారు. విజయారెడ్డి చేరికతో పార్టీ అధికార ప్రతినిధి, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీచేసిన దాసోజు శ్రవణ్ అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. తాటి వెంకటేశ్వర్లు చేరికపై ఖమ్మం జిల్లా నేతలకు, అదే జిల్లాకు చెందిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు కూడా సమాచారం లేకపోవడంతో వారు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాత్రం ఖమ్మం జిల్లా నుంచి కాంగ్రెస్లోకి వలసల తుఫాను ఉంటుందని ప్రకటించారు. దీనిపై కూడా ఆ జిల్లా నేతలెవరికీ సమాచారం ఇవ్వకపోవడంతో కొంతమంది అలకబూనినట్లు తెలిసింది. పార్టీలో అసంతృప్తి ఇలాగే పెరిగితే చేరికలు పెరిగినా ప్రయోజనం ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Also Read:Pawan Kalyan: బీజేపీతోనే వైసీపీ.. టీడీపీతో వద్దు.. పవన్ ఏం చేయనున్నారు?