చైనా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్న కరోనా వ్యాక్సిన్లను లక్షలమంది ప్రజలకు ఇస్తూ దారుణానికి పాల్పడుతోంది.ప్రపంచ మీడియాలో ఈ మేరకు ప్రచురితమైన ఈ కథనం సంచలనమైంది. కరోనా వ్యాక్సిన్ ఇంకా రెడీ కాకముందే అది పూర్తి స్థాయిలో పనిచేస్తుందో లేదో తెలియకముందే ఈ ప్రయోగాలు చేస్తున్నారు. అంతేకాదు రహస్య ఒప్పందం మీద చైనా ప్రభుత్వం సంతకాలు చేయించిందట.. దీని వల్ల ప్రజలకు దుష్ప్రభావాలు కలుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చైనాలో ప్రఖ్యాత రచయిత కాన్ చాయ్ ఇటీవల వెబినార్ లో ఈ ప్రయోగాత్మక టీకాలు జనాలు ఇస్తున్నారని బాంబు పేల్చారు. మానవ ప్రయోగాలు కాకముందే చైనా కంపెనీలు జనాలకు ఇస్తూ వారి ప్రాణాలతో ఆటలాడుతున్నాయని ఆయన ఆరోపించారు. తనకు ఇచ్చారని తన ఆరోగ్యం కూడా దెబ్బతిన్నదని ఆయన తెలిపారు.అయితే ఈ చర్యలను చైనా అధికారులు సమర్థించుకుంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధేశించిన ప్రకారమే నడుచుకుంటామని చెప్పారు.
కరోనా వైరస్ పై టీకా ఇంకా ప్రయోగదశలో ఉండగానే చైనా ఈ దారుణానికి పాల్పడుతోంది. దీనివల్ల ప్రజలకు దుష్ప్రభావాలు కలుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నా ఆపడం లేదని పేర్కొంది. చైనాలో పలు సంస్థలు కరోనాకు వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తున్నాయి. అవన్నీ ప్రయోగ దశలోనే ఉన్నాయి. సాధారణ వినియోగానికి అనుమతి రాలేదు.
అయితే కరోనాతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ‘అత్యవసర అనుమతి’కింద ఆ వ్యాక్సిన్లను ఇచ్చేందుకు చైనా ప్రభుత్వం జూన్ లో అనుమతిచ్చింది. దీన్ని బేస్ చేసుకొని అక్కడి కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్న కంపెనీలు మాత్రం లక్షలమందికి ఈ టీకాలు ఇచ్చేస్తున్నాయి.