ABN RK – CBI : వివేకా హత్య కేసు విచారణలో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. ఎప్పటికప్పడు సిట్లు మారుతున్నాయి. పొలిటికల్ హై ప్రొఫైల్ కేసు కావడంతో ఎన్నెన్నో అనుమానాలు, రాజకీయ అడ్డంకులు ఏర్పడుతున్నాయి. అయితే ఈ కేసుకు సంబంధించి మీడియా చేస్తున్న అతి ఇంతా అంతా కాదు. జగన్ అనుకూల మీడియాలో ఒకలా.. వ్యతిరేక మీడియాలో మరోలా వివేకా హత్య కేసు గురించి కథనాలు ప్రచురిస్తున్నాయి. వివేకా హత్య ఘటన వెలువడిన నాటి నుంచి ఈ తరహా పరిణామాలు వెగటు పుట్టించాయి. జగన్ అనుకూల మీడియాలో బాబాయ్ వివేకా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా అనేక కథనాలు వచ్చాయి. వ్యతిరేక మీడియా మాత్రం జగన్ అండ్ కోను దోషిగా నిలబెట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి.
చిత్రవిచిత్రాలు..
అయితే తొలుత వివేకా హత్యను గుండెపోటుగా చిత్రీకరించారు. తరువాత హత్య అని మాట మార్చారు. రాజకీయ కోణంలో హత్య జరిగిందని ఆరోపణలు చేశారు. నాటి సీఎం చంద్రబాబే చేయించారని ఆరోపించారు. సాక్షాత్ సాక్షిలో నారాసుర రక్తచరిత్ర అన్న శీర్షికన కథనాలు వండి వార్చారు. గత ఎన్నికల్లో సానుభూతి సొంతం చేసుకున్నారు. అధికారంలోకి రాగలిగారు. అయితే ఇప్పుడు సీబీఐ జగన్ అండ్ కో చుట్టూ పట్టుబిగుస్తుండడంతో కలవరపాటకు గురవుతున్నారు. అయితే నాడు సాక్షి చేసిన తప్పిదాన్నే.. కొన్ని మీడియాలు చేస్తున్నాయి. అందులో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాక్రిష్ణ అదే పనిగా వివేకా హత్యపై కథనాలు రాస్తున్నారు. ఇటీవల రాసిన కొత్తపలుకు కాలమ్ లో సీఎం జగన్ దంపతులకు తెలిసే హత్య జరిగిందని రాసుకొచ్చారు. ఇది చర్చనీయాంశంగా మారింది.
జగన్ కు ముందే తెలుసా?
ఆర్కే కొత్త పలుకులో ఇలా రాసుకొచ్చారు. ‘2019 మార్చి 15 అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో వివేకా హత్య జరిగింది. అదేరోజు తెల్లవారుజామున 4.30 గంటలకు ఎన్నికల ప్రణాళిక రూపకల్పన కోసమై నలుగురు ముఖ్యులను జగన్ హైదరాబాద్ లోటస్ పాండ్లోని తన నివాసానికి పిలిపించుకున్నారు. ఇది ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమం. తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు ఆ నలుగురితో జగన్ సమావేశమయ్యారు. ఇంతలోనే మేడ మీద నుంచి పిలుపు వచ్చింది. వెంటనే ఇంట్లోకి వెళ్లిన జగన్ పది నిమిషాల తర్వాత తిరిగి సమావేశ ప్రదేశానికి వచ్చారు. చిన్నాన్న గుండెపోటుతో చనిపోయారని ఆ నలుగురికీ చెప్పి సమావేశాన్ని కొనసాగించారు. అంటే, వివేకా హత్య గురించి ప్రపంచానికి తెలియక ముందే జగన్ దంపతులకు తెలుసునని స్పష్టమవుతోంది. హత్య తర్వాత అవినాశ్ రెడ్డి ఫోన్ నుంచి జగన్ దంపతుల వ్యక్తిగత కార్యదర్శులకు ఫోన్లు వెళ్లాయని సీబీఐ విచారణలో కూడా వెల్లడైన విషయం విదితమే’ అని పేర్కొన్నారు.
ఆ నలుగురిని అదుపులోకి తీసుకుంటే..
నాడు జగన్ తో ఉన్న ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జగన్ పర్సనల్ సెక్రటరీ కృష్ణమోహన్ రెడ్డి, దివంగత సోమయాజులు కుమారుడు కృష్ణ,రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం ఉన్నట్టు తన కాలమ్ లో నిర్ధారించిన ఆర్కే.. ఆ నలుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తే అసలు నిజం వెల్లడవుతుందని తన కాలమ్ లో రాసుకొచ్చారు. అయితే ఈ విషయం రాధాక్రిష్ణకు ఎలా తెలుసు? ఆయన చూశారా? లేకుంటే ఆధారాలేమైనా అతడి వద్ద ఉన్నాయా? అన్నవి తెలియాలంటే ఆయన్ను సీబీఐ విచారించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అంతకు ముందే సీబీఐ నోటీసులిస్తే ఈ కేసును ఆయనే కొలిక్కి తెస్తారని ఎక్కువ మంది విశ్వసిస్తున్నారు. లేకుంటే కేసులో అతి జోక్యాన్ని తగ్గించుకుంటారన్న వాదన వినిపిస్తోంది.