Raja Reddy Marriage: వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాజస్థాన్ లోని జోద్ పూర్ ఉమేధ్ ప్యాలెస్ లో వేడుకలు కొనసాగుతున్నాయి. ఆదివారం రాజారెడ్డి, ప్రియా అట్లూరి వివాహ బంధంతో ఒకటి కానున్నారు. తాజాగా వీరిద్దరి హల్దీ వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితులు మధ్య హల్దీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
వైట్ అండ్ వైట్ లో నూతన వధూవరులు మెరిసిపోయారు. షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్ దంపతులతో పాటు జగన్ తల్లి విజయమ్మ, నూతన వధువు ప్రియా తల్లిదండ్రులు, ఇరు కుటుంబ సభ్యులు ఫోటోషూట్ కు దిగారు. రాజస్థాన్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో ఈ వివాహం జరగనుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ, సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. షర్మిల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కావడంతో ఏఐసిసి అగ్రనేతలు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది.
గత మూడు రోజులుగా ఉమ్మెద్ ప్యాలెస్ లో పెళ్లి వేడుకలు కొనసాగుతున్నాయి. నూతన వధూవరులకు సంబంధించి సన్నిహిత కుటుంబాలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నాయి. వైఎస్ విజయమ్మ పెళ్లి వేడుకల్లో సందడిగా కనిపించారు. మరోవైపు వివాహ వేడుకలకు ఏపీ సీఎం జగన్ హాజరవుతారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. గత నెలలో జరిగిన నిశ్చితార్థ వేడుకలకు జగన్ హాజరైన సంగతి తెలిసిందే. అప్పటికే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో సోదరుడు జగన్తో అంటీ ముట్టనట్టుగా వ్యవహరించినట్లు వార్తలు వచ్చాయి. పీసీసీ పగ్గాలు అందుకున్నాక నేరుగా జగన్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ హాజరు సందిగ్ధంగా మారింది. ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడు లో సిద్ధం సభలో జగన్ పాల్గొనున్నారు. మరోవైపు ఈ వివాహ వేడుకలకు చంద్రబాబుతో పాటు పవన్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది.