CM Jagan to I Pack office
CM Jagan : అందరి దృష్టి జూన్ 4 పైనే ఉంది. ఆరోజు ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయితే ఏపీలో అన్ని పార్టీలు విజయం పై ధీమాతో ఉన్నాయి. అధికార వైసిపి మరోసారి విజయం సాధిస్తానని గట్టి నమ్మకంతో ఉంది. ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని.. తాము అధికారంలోకి రావడం ఖాయమని టిడిపి కూటమి భావిస్తోంది. అటు పార్లమెంట్ స్థానాల వారీగా తమకు లభించే సీట్లను అంచనా వేసుకుంటున్నారు.ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది సోషల్ మీడియాలో సైతం హాట్ డిబేట్ గా మారింది.
పోలింగ్ ముగిసిన తరువాత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ అన్ని పార్టీల వారీగా విడిపోయాయి. ఎవరికి వారే 100 స్థానాలతో తమ ప్రభుత్వమే అధికారంలోకి రాబోతుందని చెప్పుకొస్తున్నాయి. కొందరైతే మరి అతిగా ప్రదర్శిస్తున్నారు. మంత్రివర్గాలను సైతం ప్రకటిస్తున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే.. ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయోనని అప్పుడే చర్చ మొదలు పెట్టేశారు. ఇప్పటికే సీఎం జగన్ ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. తమదే విజయం అని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబుతో పాటు పవన్ సైతం ఇదే తరహాలో ప్రకటన చేశారు.
అయితే టిడిపి కూటమిలో కనిపించిన ధీమా.. అధికారపక్షంలో కనిపించకపోవడం ఆ పార్టీ క్యాడర్లో ఆందోళన కలిగిస్తోంది. ఒకరిద్దరు కీలక నేతలు చేసిన వ్యాఖ్యలతో అనుమానాలు మరింత పెరిగాయి. అందుకే ఇప్పుడు జగన్ రంగంలోకి దిగారు. శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఐ ప్యాక్ కార్యాలయాన్ని ఈరోజు జగన్ సందర్శించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో విజయవాడ బెంజ్ సర్కిల్ లో ఉన్న కార్యాలయాన్ని జగన్ సందర్శిస్తారు. 20 నిమిషాల పాటు ఐప్యాక్ ప్రతినిధులతో సమావేశమవుతారు. పరిస్థితిని తెలుసుకుంటారు. గత ఎన్నికల్లో సైతం ఐప్యాక్ కార్యాలయాన్ని జగన్ సందర్శించారు. ఈసారి కూడా అదే మాదిరిగా సందర్శించి వైసిపి క్యాడర్లో ఒకరకమైన ఆత్మస్థైర్యాన్ని పెంచాలని జగన్ భావిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.