Phone Tapping Case
Phone Tapping Case: తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్వేకొద్దీ సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇన్నాళ్లూ కేసు విచారణ కాస్త మందగించింది. పోలింగ్ పూర్తికావడంతో మళ్లీ వేగం పుంజుకుంది. తాజాగా ఈ విచారణలో ఈ ట్యాపింగ్ వ్యవహారం గత నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎక్కువగా జరిగినట్ల పోలీసులు గుర్తించారు. గతేడాది ఆగస్టు నుంచి నవంబర్ చివరి వరకు దాదాపు 1,300 ఫోన్లు ట్యాప్ చేసినట్లు వెల్లడైంది. నాలుగ నెలల్లో రోజుకు సగటున పది ఫోన్లు ట్యాప్ చేసినట్లు విచారణలో గుర్తించారు. నవంబర్ నెలాఖరు వరకు చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.
బీఆర్ఎస్కు లబ్ధికే..
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు లబ్ధి చేకూర్చడానికిఏ ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావు ఈ దందా సాగించినట్లు తెలుస్తోంది. ఎన్నికలు నవంబర్ 30న జరిగాయి. పోలింగ్ ముగిసిన వెంటనే ఫోన్ ట్యాపింగ్ కూడా ఆగిపోయింది. బీఆర్ఎస్ అభ్యర్థులపై పోటీ చేస్తున్న అభ్యర్థులను నియంత్రించడానికే ఇలా ఫోన్లు ట్యాపంగ్ చేశారని తేలింది. చాలాచోట్ల విపక్షాల అభ్యర్థులకు చెందిన సొమ్మును ఫోన్ ట్యాపింగ్ ద్వారా జప్తు చేసినట్లు తెలుస్తోంది.
1,300 ఫోన్లపై నిఘా..
ఇక ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన నేతలకు సంబంధించిన 1,300 ఫోన్లపై ప్రభాకర్రావు సారథ్యంలో ఎస్ఐబీ బృందం నిఘా ఉంచినట్లు తేలింది. విచారణలో భాగంగా బాధితుల వాంగ్మూలాలను కూడా సేకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా జరిగిన నష్టం వివరాలను బాధితులతోనే చెప్పిస్తున్నట్లు సమాచారం. ట్యాపింగ్ జరిగినట్లు నిర్ధారణ అయినందున దాని పర్యవసానాలు కూడా కోర్టుకు కీలకం. ఈ నేపథ్యంలోనే వాంగ్మూలాలు సేకరిస్తున్నట్లు సమాచారం.