What is the reason behind CM Jagan's victory announcement?
CM Jagan : జగన్ ధీమాతో ఉన్నారా? ఆయన లెక్క ఆయనకు ఉందా? అందుకే కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారా? లేకుంటే పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకే ఆ ప్రయత్నమా? పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఎన్నికల్లో సూపర్ విక్టరీ సాధిస్తానని జగన్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా వైసీపీ విజయం.. సంచలనంగా మారుతుంది అని కూడా తేల్చి చెప్పారు. తాజాగా ఆయన ఐ ప్యాక్ టీం సభ్యులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గత ఎన్నికల ముందు నుంచి ఐపాక్ టీం వైసీపీ కోసం పనిచేస్తోంది. ఈ టీం ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో ఏర్పడింది. గత ఎన్నికల్లో వైసీపీకి విజయం సాధించిన తర్వాత ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్త పదవిని వదులుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. సొంత రాష్ట్రం బీహార్లో రాజకీయాలు చేస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో పోలింగ్ నాడే.. సీఎం జగన్ ప్రశాంత్ కిషోర్ ను కలిసారు. సూపర్ విక్టరీ కొట్టామని పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అయితే ఈసారి మాత్రం వైసీపీలో ఆ ధీమా కనిపించలేదు. గతం మాదిరిగా ఐపాక్ టీం అధినేత రుషిరాజ్ సింగ్ ను జగన్ కలవలేదు. దీంతో ఒక రకమైన చర్చ ప్రారంభమైంది. అందుకే ఈరోజు జగన్ విజయవాడ బెంజ్ సర్కిల్ లో ఉన్న ఐ ప్యాక్ కార్యాలయాన్ని ప్రత్యేకంగా సందర్శించినట్లు తెలుస్తోంది.
ఈ సమావేశంలో జగన్ హాట్ కామెంట్స్ చేశారు. రేపు ఫలితాలను చూసి దేశం షాక్ కు గురవుతుందని చెప్పుకొచ్చారు. ఆసక్తికర ఫలితాలు వస్తాయని కూడా తేల్చి చెప్పారు. దీంతో ఇదో వైరల్ అంశంగా మారింది. పోలింగ్ శాతం పెరగడం, ఉద్యోగ ఉపాధ్యాయుల నుంచి వ్యతిరేకత, వంటి కారణాలతో వైసిపి శ్రేణులు డీలా పడ్డాయి. ఈ నేపథ్యంలోనే జగన్ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. అందుకే నేరుగా ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లి ఈ కీలక ప్రకటన చేసినట్లు సమాచారం. కేవలం వైసీపీ ఓటమి చెందుతుందని వస్తున్న విశ్లేషణలు, ప్రచారానికి చెప్పేందుకే జగన్ కీలక ప్రకటన చేసినట్లు అనుమానాలు ఉన్నాయి. అయితే జగన్ ప్రకటనతోవైసీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకుంటున్నాయి.