Visakha Volunteer
Visakha Volunteer: విశాఖలో దారుణం చోటుచేసుకుంది. వార్డు వాలంటీర్ చేతిలో వృద్ధురాలు దారుణ హత్య గురైంది. అక్కడున్న సీసీ పూటేజీల ఆధారంగా నిందితుడు వార్డు వాలంటీర్ గా పోలీసులు నిర్ధారించారు. స్థానికంగా ఈ ఘటన సంచలనం రేకెత్తించింది.
పెందుర్తి సుజాతనగర్ లో వరలక్ష్మీ అనే 73 ఏళ్ల వృద్ధురాలు షాప్ నిర్వహిస్తోంది. ఆదివారం రాత్రి 10:30 గంటలకు ఆమె ఇంట్లోనే దారుణ హత్యకు గురైంది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పెందుర్తి పోలీసులు,క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకుంది. వృద్ధురాలి ముఖంపై దిండు పెట్టి హత్య చేసినట్లు అక్కడ ఉన్న ఆనవాళ్ళు తెలియజేస్తున్నాయి. హత్యగా నిర్ధారించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
95వ వార్డు పురుషోత్తపురం పరిధిలో వాలంటీర్ గా పనిచేస్తున్న వెంకటేష్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. గతంలో వృద్ధురాలి షాపులో వెంకటేష్ పార్ట్ టైం ప్రాతిపదికన పని చేసేవాడు. ఆమెను హత్య చేసిన తర్వాత ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకొనిపోయాడు. అపార్ట్మెంట్లో సిసి పూటేజీలు గమనించిన తర్వాత.. వాలంటీర్ వెంకటేష్ ఈ ఘాతకానికి పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు పెందుర్తి పోలీసులు తెలిపారు.
ఇటీవల పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థ పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ నేతలు ముప్పేట దాడి చేశారు. వాలంటీర్ల వ్యవస్థను కించపరుస్తావా అంటూ సాక్షాత్ సీఎం జగన్ సైతం పవన్ పై వ్యక్తిగత దాడుల వర్షం కురిపించారు. వాలంటీర్ల వ్యవస్థ అత్యున్నతమైనదిగా చెప్పుకొచ్చారు. అయితే జగన్ ఇలా కామెంట్స్ చేసిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థలో చాలా రకాల లోపాలు బయటపడ్డాయి. ఇప్పుడు ఏకంగా నగదు కోసం ఓ అపార్ట్మెంట్లో చొరబడి వృద్ధురాలిని వాలంటీర్ హత్య చేసిన తీరు చూస్తుంటే.. పవన్ వ్యాఖ్యలు నిజమేనని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. దీనికి బదులు చెప్పాల్సిన అవసరం సీఎం జగన్ పై ఉందని ఎక్కువ మంది వ్యాఖ్యానిస్తున్నారు.