Heavy Rains : ఎండలు మండిపోతున్నాయి. సూరీడు భగభగలాడుతున్నాడు. బయటకు వెళితే ప్రాణాలు పోయేంతగా వేడి నెలకొంది. ఇంతటి ఎండాకాలంలో ప్రజలు ఏసీలు, కూలర్లు పెట్టుకొని సేదతీరుతున్నారు. మధ్యాహ్నం అంతా కర్ఫ్యూ వాతావరణమే ఉంటోంది. లాక్ డౌన్ తరహాలో బయట పరిస్తితి ఉంది. దుకాణాదారులు అంతా మధ్యాహ్నం పూట బంద్ చేసి.. ఉదయం సాయంత్రం మాత్రమే తెరుస్తున్నారు. ఈ వేడి సమయంలో చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు తీపినందించే వార్త తెలిపింది.
తెలుగు రాష్ట్రాలలోకి బుధవారం నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని.. వీటి ప్రభావంతో రానున్న రెండు మూడు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఆదివారం కూడా భారీ వర్షం కురుస్తుందని తెలిపింది.
రానున్న రెండు మూడురోజుల్లోనే రుతుపవనాల్లో కదలికలు భారీగా ఉండవచ్చని.. వీటి ప్రభావంతోనే ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక, రాయలసీమ ప్రాంతంలో పగటి ఉష్ణోగ్రతలు తగ్గుతాయన్నారు. వాస్తవానికి తెలంగాణలో సోమవారం నుంచి వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయని.. ఉష్ణోగ్రతలు చాలా జిల్లాల్లో తగ్గాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఇక గత సంవత్సరం చూస్తే రుతుపవనాలు తొందరగా వచ్చేశాయి. జూన్ 1న కేరళను తాకి నాలుగురోజుల్లోనే తెలంగాణలోకి వచ్చాయి. కానీ ఈ ఏడాది కేరళలో మూడు రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు అడుగుపెట్టినప్పటికీ తెలంగాణలో మాత్రం కొంత ఆలస్యంగా బుధవారం అడుగుపెట్టే అవకాశం ఉంది. మంగళవారం కల్లా ఏపీలోకి ప్రవేశించవచ్చు. దీంతో తెలుగు రాష్ట్రాలు వేడి నుంచి ఉపశమనం పొందే అవకాశం కనిపిస్తోంది.