November sentiment.. Will BJP win in Munugodu? Gరాజకీయ పార్టీలకు, నాయకులకు సెంటిమెంట్లు, నమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని సాధారణ సమయంలో ఎవరూ గమనించరు. కానీ ఎన్నికల వేళ నాయకులే వీటిని స్వయంగా బయట పెడతారు. నామినేషన్ సమయంలో గుళ్లకు వెళ్లడం, స్వామీ జీలను కలుసుకోవడం, యాగాలు చేయడం జరుగుతాయి. కొందరు తమకు కలిసివచ్చే సంఖ్యను చూసుకుంటారు, మరికొందరు లక్కీ నంబర్ వస్తు కలిసొస్తుందనుకుంటారు. కొన్నిసార్లు సెంటిమెంట్లు కలిసొస్తున్నాయి. సీఎం కేసీఆర్కు 6 నంబర్ లక్కీ. అందుకే ఆయన 2018లో డిసెంబర్ 6న ప్రభుత్వాన్ని రద్దు చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జిల్లాలను కూడా తన లక్కీ నంబర్కు అనుగుణంగానే 6 నంబర్ వచ్చేలా 33 జిల్లాలుగా ఏర్పాటు చేశారు. ప్రచారం, నామినేషన్ సమయంలోనూ కేసీఆర్ సెంటిమెంట్ను ఫాలో అవుతారు. తాజాగా మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో నవంబర్ సెంటిమెంట్ తెరపైకి వచ్చింది. బీజేపీకి 11వ నెల కలిసి వస్తుందని గత ఫలితాల ఆధారంగా తెలుస్తోంది.
-పాజిటివ్ నవంబర్..
తెలంగాణలో బీజేపీ రాజకీయంగా మూడేళ్లుగా దూకుడుగా వెళ్తోంది. టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అన్నట్లుగా రాజకీయం చేస్తోంది. ఈమేరకు ఫలితాలు కూడా రాబడుతోంది. ఉప ఎన్నికల్లో విజయాలు సాధిస్తూ.. ప్రజాదరణ పొందుతోంది. ఈ క్రమంలో గతంలో జరిగిన దుబ్బాక, హుజూరాబాద్ రెండు ఉప ఎన్నికల ఫలితాలు నవంబర్లోనే వచ్చాయి. ఈ క్రమంతో తాజాగా మునుగోడు కౌంటింగ్ కూడా నవంబర్లోనే జరుగుతోంది. దుబ్బాక, హుజూరాబాద్లో వచ్చిన ఫలితాలే మునుగోడులోనూ రిపీట్ అవుతుందని బీజేపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్ నవంబర్ 10న జరిగింది. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు విజయం సాధించారు. ఇక గతేడాది జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల కౌంటింగ్ కూడా నవంబర్ 02న జరిగింది. ఈ ఫలితం కూడా బీజేపీకి కలిసి వచ్చింది. ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు.
-మునుగోడులో అదే రిపీట్..
దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించినట్లుగానే మునుగోడు ఉప ఎన్నికల ఫలితం ఉంటుందని బీజేపీ మొదటి నుంచి చెబుతోంది. ఈ క్రమంలో తాజాగా నవంబర్ సెంటిమెంట్ను జోడించింది. గత రెండు ఉప ఎన్నికల కౌంటింగ్ నవంబర్లో జరుగడం బీజేపీకి కలిసి వచ్చింది కాబట్టి.. మునుగోడు కౌంటింగ్ కూడా నవంబర్లో జరుగుతుంది కాబట్టి ఫలితాల్లో తేడా ఉండదని బీజేపీ నాయకులు పేర్కొంటున్నారు. ఉప ఎన్నిక నియోజకవర్గం మాత్రమే మారిందని, ఫలితం మాత్రం మాదరని ధీమా వ్యక్తం చేస్తున్నారు.