Hyderabad Bhagyanagar: తెలంగాణ బీజేపీ నేతలు ఊ అంటే చాలు ‘హైదరాబాద్ ’ను భాగ్యనగరం అంటారు. ఏదైనా ప్రారంభించేటప్పుడు చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుంటారు. నిజాం నవాబులు కట్టించిన హైదరాబాద్ మహానగరాన్ని ఇప్పటికీ కొందరు బీజేపీ నేతలు ‘భాగ్యనగరం’ అని ప్రకటనల్లో పిలుస్తుంటారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అయితే పాతబస్తీలోని ముస్లింలు ఎక్కువగా ఉండే చార్మినార్ వద్దగల ‘భాగ్యలక్ష్మీ’ అమ్మవారిని దర్శించుకోకుండా ఏ పని ప్రారంభించరు. అమిత్ షా నుంచి కేంద్రమంత్రులు వరకూ భాగ్యలక్ష్మీ అమ్మవారిని కొలిచి.. అసలు హైదరాబాద్ అంతకుముందు భాగ్యనగరం అని.. నిజాలు మార్చారంటూ కామెంట్ చేస్తుంటారు. మరి నిజంగా మన హైదరాబాద్ ఒకప్పుడు భాగ్యనగరమా? చరిత్రలో ఏమైనా నిజాలు ఉన్నాయా? నిజాంలు మార్చారా? అన్న దానిపై ఏఎస్ఐ పరిశోధించి మరీ వివరంగా చెప్పింది. దీన్ని బట్టి హైదరాబాద్ భాగ్యనగర్ అన్న వివాదానికి తెరదించింది.
ఇప్పటికే హైదరాబాద్ గతంలో ‘భాగ్యనగరం’గా ఉండేదని కొందరు వాదిస్తుంటారు.దీని పేరు హైదరాబాద్ తీసేసి భాగ్యనగర్ గా మార్చాలని డిమాండ్ చేస్తుంటారు. బీజేపీకి చెందిన నేతలతోపాటు పలు సంఘాలు డిమాండ్ చేస్తుంటాయి. ఈ వివాదంపై తాజాగా భారతీయ పురాతత్వశాఖ (ఏఎస్ఐ) స్పష్టతనిచ్చింది.
హైదరాబాద్ భాగ్యనగర్ అనేందుకు తగిన చారిత్రక ఆధారాలు, నేపథ్యం లేవని స్పష్టం చేసింది. అలాగే చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మీ దేవాలయానికి సంబంధించిన చారిత్రక ఆధారాలు కూడా లేవని ఏఎస్ఐ వెల్లడించింది.
రాబిన్ అనే వ్యక్తి దాఖలు చేసిన సమాచార హక్కుచట్టం దరఖాస్తు ద్వారా ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ సమాచారం ప్రకారం.. హైదరాబాద్ నగరానికి ఆ పేరు తప్ప భాగ్యనగర్ లేదా మరో పేరేది లేదని ఏఎస్ఐ స్పష్టం చేసింది. భాగ్యనగర్ పేరుతో హైదరాబాద్ పూర్వపు చరిత్రలో ఎలాంటి నాణేలు విడుదల కాలేదని తెలిపింది.
ఇక నిజాంలను ఓడించి హైదరాబాద్ కు విముక్తి కల్పించిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్.. ‘హైదరాబాద్ పేరు మార్చేందుకు ప్రయత్నించినట్టు ఎలాంటి ఆధారం లేదని’ ఏఎస్ఐ స్పష్టం చేసింది. చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మీ దేవాలయం ఉన్నట్లు ఆధారాలు లేవన్నారు. ఈ దేవాలయాన్ని 1960లో అక్రమంగా నిర్మించినట్లు తెలిపింది. అలాగే హిందూదేవాలయాలు ఉన్న ప్రాంతంలో మసీదులు కట్టినట్లు కూడా ఎలాంటి ఆధారాలు లేవని ఏఎస్ఐ వెల్లడించిన వివరాల ఆధారంగా తెలుస్తోంది.