Night curfew in AP: న్యూ ఇయర్ వేడుకల తర్వాత దేశ వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూ థర్డ్ వేవ్ సంకేతాలు కన్పిస్తున్నాయి. కరోనాకు తోడుగా ఒమ్రికాన్ కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతుండటంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తం అవుతున్నాయి. కరోనా నివారణలో భాగంగా ఏపీ సర్కారు మరోసారి నైట్ కర్ఫ్యూను అమలు చేసేందుకు సిద్ధమైంది. నేటి సాయంత్రం నుంచి నైట్ కర్ఫ్యూల్లోకి అమల్లోకి వస్తుందని జగన్ సర్కార్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వం విధించిన కోవిడ్ నిబంధనలు ప్రతీఒక్కరు తప్పనిసరిగా పాటించాలనే లేకుంటే కఠిన చర్యలు తప్పవనే సంకేతాలను ప్రభుత్వం పంపిస్తోంది. ఈక్రమంలోనే జన సముదాయాలు ఎక్కువగా ఉండే థియేటర్లు, మాల్స్, పార్కులు, రెస్టారెంట్లలో 50శాతం ఆక్సుపెన్సీ మాత్రమే ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం సినిమా ఇండస్ట్రీకి పెద్ద శాపంగా మారబోతుంది.
సినిమా టికెట్ల తగ్గింపు ఇష్యూతో ఇప్పటికే భారీ బడ్జెట్ సినిమాలన్నీ వాయిదాలు పడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న టికెట్ల రేట్లు, 50శాతం ఆక్సుపెన్సీని అమలు చేస్తే థియేటర్ల వ్యవస్థ కుదేలయ్యేలా కన్పిస్తోంది. దీంతో యావత్ ఇండస్ట్రీకి ప్రభుత్వం నిర్ణయం ప్రమాదకరంగా మారడం ఖాయమనే టాక్ విన్పిస్తోంది. జగన్ సర్కార్ తాజా నిర్ణయం వల్ల సంక్రాంతి రిలీజు అయ్యే కొత్త సినిమాలు వాయిదాలు పడటం ఖాయంగా కన్పిస్తోంది.
టికెట్ల రేట్ల తగ్గింపుతో తన సినిమాకు ఏమి నష్టం లేదని చెబుతున్నకింగ్ నాగార్జున ఈ సక్రాంతికి తన ‘సొగ్గాడే చిన్నినాయన-2’ మూవీని తీసుకొస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. కరోనా నివారణ కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్టే అయినప్పటికీ సినిమా ఇండస్ట్రీకి మాత్రం శాపంగా మారేలా కన్పిస్తోంది. టికెట్ల రేట్లు తగ్గింపు తర్వాత ఏపీ సర్కార్ వర్సెస్ టాలీవుడ్ మధ్య గ్యాప్ వచ్చింది. ఇలాంటి సమయంలో జగన్ సర్కార్ తాజాగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని సినీ పెద్దలు ఏమేరకు స్వాగతిస్తారనేది ఆసక్తిని రేపుతోంది.