Kashmir : పర్యావరణానికి ప్లాస్టిక్ పెను ముప్పుగా పరిణమించింది. ఈ భూతాన్ని తరిమికొట్టేందుకు ప్రభుత్వాలు చేపట్టిన కార్యక్రమాలు, చర్యలు అంతగా ఫలించడం లేదు. కానీ, ఓ కుగ్రామం మాత్రం ఈ భూతాన్ని అంతం చేయడానికి వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. గ్రామస్తులంతా సమష్టిగా ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. కేవలం 15 రోజుల్లోనే ఊరిని ప్లాస్టిక్ రహితంగా మార్చేసి.. ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వ పథకం కాకపోయినా ప్లాస్టిక్పై పోరులో విజయం సాధించడం అధికారులు ప్రశంసలు అందుకుంటోంది.
సర్పంచ్ సంకల్పంతో..
జమ్మూకశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోని హిల్లర్ షాబాద్ బ్లాక్లో సాదివార గ్రామం ప్లాస్టిక్ రహిత ఊరుగా ఘనత సాధించింది. పర్యావరణ పరిరక్షణకు సాదివార గ్రామ పంచాయతీ సర్పంచ్ ఫారూక్ అహ్మద్ గనాయ్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఫారూక్.. ప్లాస్టిక్ను ఎలాగైనా తమ గ్రామం నుంచి తరిమేయాలని సంకల్పించారు. దీంతో ప్లాస్టిక్ తెచ్చివ్వండి.. బంగారం తీసుకెళ్లండంటూ గ్రామస్తులకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. 20 క్వింటాళ్ల ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకొస్తే ఒక బంగారు నాణెం ఇస్తానని ప్రకటించారు. ప్రకటించినట్లుగానే తాను నిర్దేశించిన మొత్తంలో ప్లాస్టిక్ తీసుకొచ్చినవారికి బంగారం ఇవ్వడం మెుదలుపెట్టారు.
ప్లాస్టిక్ వేటలో గ్రామస్తులు..
బంగారం ఆఫర్తో గ్రామస్తులంతా వీధుల్లో తిరుగుతూ ప్లాస్టిక్ వేటలో పడ్డారు. ఎక్కడ ప్లాస్టిక్ ముక్క కనిపించినా వదిలిపెట్టడం లేదు. దీంతో కేవలం 15 రోజుల్లో ఊరంతా ప్లాస్టిక్ రహితంగా మారిపోయింది. గ్రామంతోపాటు సమీపంలోని వాగులు, నదులు, చెరువులు కూడా శుభ్రమయ్యాయి. రెండు వారాల్లోనే అనూహ్య మార్పు చూసి అధికారులే విస్తుపోయారు. ప్రభుత్వ పథకం కాకపోయినా సర్పంచ్ చొరవతో గ్రామస్తులు సాధించిన ఈ విజయంతో సాదివార గ్రామాన్ని స్వచ్ఛభారత్ అభియన్-2 కింద ప్లాస్టిక్ రహిత గ్రామంగా ప్రకటించారు.
కొనసాగుతున్న సమయం..
ప్లాస్టిక్పై సమరం సాదివార గ్రామంతోనే ఆగిపోలేదు. చుట్టుపక్కల గ్రామాలు కూడా దీనిని ప్రేరణగా తీసుకుని తమ పంచాయతీల్లోనూ అమలు చేయడం మొదలు పెట్టాయి. సాదివార సర్పంచ్ ఫారూక్ ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ఈ విధానంతో గ్రామమే కాకుండా సమీపంలోని వాగులు, నదులు కూడా శుభ్రమయ్యాయని తెలిపారు. ‘పాలిథిన్ తెచ్చి ఇస్తే బహుమతి ఇస్తాననే నినాదాన్ని మా గ్రామంలో ప్రారంభించాను.. నదులు, వాగులు శుభ్రత కోసం ఈ కార్యక్రమం చేపట్టాను.. ప్రస్తుతం గ్రామంలోని ప్రతి ఒక్కరూ సహకరించి ఎక్కడా పాస్టిక్ లేకుండా చేశారు.. గ్రామంలోని రోడ్లు, వీధులు శుభ్రమయ్యాయి.. ఎక్కడ ప్లాస్టిక్ కనిపించినా దానిని సేకరించి పంచాయతీ సభ్యులకు ఇస్తున్నారు.. మిగతా గ్రామాలకు మా ఊరు ఉదాహరణంగా నిలిచింది.. ప్రభుత్వం కూడా ఇదే ఆలోచనను కేంద్రపాలిత ప్రాంతంలోని అన్ని గ్రామాల్లో అమలు చేయడానికి ప్రయత్నిస్తోంది’ అని వెల్లడించాడు.
ప్రభుత్వాలు ప్లాస్టిక్ను తరిమికొట్టేందుకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నా ఫలితం లేదు. కానీ ఓ మారుమూల ఊరు సర్పంచ్కు వచ్చిన చిన్న ఐడియా ఆ ఊరును ప్లాస్టిక్ రహితంగా మార్చడమే కాక, అధికారులే ఆశ్చర్యపోయేలా చేసింది. మరి ఈ ఐడియాతో అయినా పాలకులు మేలొ్కంటారో లేదో చూడాలి.