Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలకు కేవలం వారం రోజుల సమయమే ఉంది. ఆరు రోజుల్లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఏపీలో పార్లమెంటుతోపాటు, అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార వైసీపీని డీకొట్టేందుకు విపక్ష టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేస్తున్నాయి. మరోసారి అధికారంలోకి రావాలని జగన్ అన్నీ తానై ప్రచారంలో దూసుకుపోతున్నారు. కూటమి తరఫున చంద్రబాబు పవన్ కళ్యాణ్తోపాటు బీజేపీ జాతీయ నేతలు రంగంలోకి దిగుతున్నారు. తాజాగా ప్రధాని మోదీ సైతం ప్రచారానికి వస్తున్నారు. అయితే.. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు.. ఏపీ కూటమిలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సోమవారం(మే 6న) రాజమండ్రి, అనకాపల్లి సభల్లో మోదీ పాల్గొంటున్నారు. మోదీ ప్రచారం సందర్భంగా కూటమిలో కొత్త టెన్షన్ మొదలైంది. రాజమండ్రిలో ప్రధాని సభకు టీడీపీ అధినేత చంద్రబాబు దూరంగా ఉంటున్నారు.
రావడం లేదా.. రావొద్దన్నారా?
ప్రధాని మోదీ పర్యటన సభకు చంద్రబాబుకు అనుమతి రాలేదా.. లేక చంద్రబాబే రావడం లేదా అన్న చర్చ ఇప్పుడు కూటమిలో మొదలైంది. మే 8వ తేదీన రాజంపేట పార్లమెంట్ స్థానం పరిధిలోని పీలేరులో సభకు మోదీ హాజరవుతారు. అదేరోజు విజయవాడలో రోడ్ షో నిర్వహిస్తారు. షెడ్యూల్లో భాగంగా సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు రాజమండ్రికి చేరుకోనున్నారు మోదీ. అక్కడి నుంచి వేమగిరి సభా ప్రాంగణానికి చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు. రాజమండ్రి ఎపీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పురంధేశ్వరితోపాటు కూటమి అభ్యర్థులను గెలిపించాలని మోదీ కోరనున్నారు. అయితే ఈ సభకు చంద్రబాబు దూరంగా ఉండడమే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
పవన్, లోకేష్కు అనుమతి..
ఇదిలా ఉండగా రాజమండ్రి సభలో జనసేనాని పవన్ కళ్యాణ్, టీడీపీ ఉపాధ్యక్షుడు నారా లోకేష్ పాల్గొనేందుకు మాత్రం అనుమతి వచ్చింది. చంద్రబాబు పాల్గొనకపోవడాడనికి ప్రధాని మోదీ ఆకాశమార్గంలో ప్రయాణించే సమయంలో మరో విమానం వెళ్లేందుకు ఆంక్షలు ఉండడమే కారణమని అంటున్నారు. అనకాపల్లి సభకు చంద్రబాబు హాజరవుతారని చెబుతున్నారు. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్, ఎమ్మెల్యే అభ్యర్థుల తరఫున మోదీ ప్రచారం చేస్తారు.
మోదీ ప్రసంగాలపై ఆసక్తి..
ఇదిలా ఉంటే.. ఎన్నికల ప్రచార సభల్లో మోదీ ఏం మాట్లాడతారు అన్న ఆసక్తి కూడా నెలకొంది. ధర్మవరంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా ఆరోపణలు చేశారు. ఇప్పుడు ప్రధాని మోదీ తన ప్రచారంలో సీఎం జగన్పై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. లాండ్ టైటిల్ యాక్ట్, ముస్లిం రిజర్వేషన్ల అంశం ఏపీలో కీలకంగా మారాయి.