Jagan Vs Chandrababu: తెలుగు మీడియా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రాజకీయ పార్టీలకు అనుకూలంగా మీడియా ఛానళ్లు మారిపోయాయి. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఎల్లో మీడియా, వైసీపీకి అనుకూలంగా బ్లూ మీడియా, అవసరాలకు తగ్గట్టు తటస్థమీడియా.. ఇలా వర్గాలుగా విడిపోయి ఏపీ రాజకీయాల్లో శాపంగా మారిపోయాయి ఈ మీడియా ఛానళ్లు. తెలుగుదేశం పార్టీ బ్లూ మీడియా గా పిలిచే సాక్షి, టీవీ9, ఎన్టీవీ లను నిషేధించింది. అటు వైసిపి ఈటీవీ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5, మహా టీవీ న్యూస్ లను నిషేధించింది. అయితే ఇప్పుడు ఎన్నికల ముంగిట తాము అభిమానించే పార్టీలను పైకి లేపడానికి ఈ మీడియాలు ప్రయత్నిస్తుండడం విశేషం.
ప్రస్తుతం ఏపీలో టాప్ మీడియా గా ఎన్టీవీ ఉంది. టిఆర్పి రేట్లో మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత స్థానంలో టీవీ9, అటు తరువాత సాక్షి టీవీ ఉంది. అయితే ఇప్పుడు ఎన్నికల్లో ఈ మూడు ఛానళ్లు వైసిపికి అనుకూలంగా పనిచేస్తున్నాయి. టిఆర్పి రేటింగ్ లో తరువాత స్థానాల్లో ఉన్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5, ఈటీవీలో తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నాయి.అయితే ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ బ్లూ మీడియాను నిషేధించింది. కానీ వాటి టిఆర్పి రేటింగ్ మాత్రం తగ్గలేదు. అటు ఎల్లో మీడియా గా పిలిచే ఆ నాలుగు చానళ్ళకు టిఆర్పి రేటింగ్ పెరగలేదు. ఇప్పుడు అదే తెలుగుదేశం కూటమికి ఇబ్బందికర పరిస్థితిగా మారింది. బ్లూ మీడియాలో ఉన్న ఎన్టీవీ, టీవీ9ల టిఆర్పి రేటింగ్ అలాగే కొనసాగుతోంది. ఇక్కడే వైసిపి వ్యూహాత్మకంగా అడుగులు వేసింది.
నిన్న టీవీ9 లో సీఎం జగన్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ వచ్చింది. రజినీకాంత్ రావు ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు. ఇది ప్రజల్లోకి బలంగా వెళ్లినట్లు వైసీపీ చెబుతోంది. ప్రజలకు జగన్ పట్ల విశ్వాసం ఉంది కాబట్టి.. ఆ ఇంటర్వ్యూ వ్యూయర్ షిప్ గణనీయంగా పెరిగిందని వైసీపీ శ్రేణులు ప్రచారం చేసుకుంటున్నాయి. రికార్డెడ్ ఇంటర్వ్యూ తో పాటు.. లైవ్ ఇంటర్వ్యూను ఒకే సమయంలో 90 వేల మంది చూశారని వైసిపి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు బిగ్ డిబేట్ పేరిట ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి చంద్రబాబు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. కానీ దాని వ్యూయర్ షిప్ కేవలం 27000 మాత్రమే ఉంది. దీనినే ఉదాహరణగా తీసుకొని.. ప్రజల్లో విశ్వసనీయత, నిజాయితీ కలిగిన నాయకులకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని ప్రచారం చేయడం ప్రారంభించారు. చంద్రబాబు ఇంటర్వ్యూను తక్కువమంది చూడడాన్ని దెప్పి పొడుస్తున్నారు. అయితే టిడిపి ఆ చానళ్లను నిషేధించడం వల్లే ఈ పరిస్థితి దాపురించింది అన్నది విశ్లేషకులు అభిప్రాయం. అయితే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నట్టు.. చంద్రబాబుపై జగన్ రికార్డ్ అంటూ ప్రచారం అయితే జోరుగా సాగుతోంది.