TDP Politics : ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుంది టిడిపి నేత లోకేష్ వ్యవహార శైలి. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం, కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తేల్చి చెబుతున్నారు. ఇందులో రెండోది ఖాయం అనుకున్నా.. ఆయన చెప్పిన మొదటి మాట మాత్రం అంత ఈజీ కాదు. జనసేనకు టిడిపి పొత్తు పెట్టుకుంది. బిజెపితో పొత్తుకు ప్రయత్నిస్తోంది. ఇంకా సీట్ల సర్దుబాటు ప్రక్రియ కొలిక్కి రాలేదు. దాదాపు 60 అసెంబ్లీ స్థానాలను ఆ రెండు పార్టీలు అడుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే టిడిపి 115 స్థానాలకే పరిమితం కావాల్సి ఉంటుంది. ఆ స్థానాల్లో టిడిపి మ్యాజిక్ ఫిగర్ కు దాటగలదా? అన్నది అనుమానమే. కానీ ఇవేవీ పరిగణలోకి తీసుకోకుండా లోకేష్ ఇష్టారాజ్యంగా ప్రకటనలు చేస్తున్నారు.
ప్రస్తుతం లోకేష్ శ్రీకాకుళంలో శంఖారావసభలను పూర్తి చేశారు. అయితే శ్రీకాకుళంలో అచ్చెనాయుడు రాష్ట్ర మంత్రి అవుతారని, రామ్మోహన్ నాయుడు ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అవుతారని లోకేష్ తేల్చి చెప్పారు. అంతటితో ఆగని ఆయన అచ్చెనాయుడు హోం మంత్రి అవుతారని కూడా తేల్చేశారు. ఉత్తరాంధ్రలో శాంతిభద్రతల పరిరక్షణలో వైసిపి ప్రభుత్వం విఫలమైందని.. దానిని గాడిలో పెట్టాలంటే ఆయన వల్లే సాధ్యమని లోకేష్ చెప్పుకొచ్చారు. అటు ఎన్డీఏ అధికారంలోకి రాబోతుందని.. టిడిపి అందులో చేరబోతుందని.. రామ్మోహన్ నాయుడు మూడోసారి గెలిస్తే కేంద్రమంత్రి పదవి ఖాయమని లోకేష్ హింట్ ఇచ్చారు. అయితే శ్రీకాకుళంలో కింజరాపు కుటుంబానికి లోకేష్ పెద్దపీట వేయడాన్ని పార్టీలో వ్యతిరేకవర్గం జీర్ణించుకోలేకపోతోంది.
మరోవైపు తెలుగుదేశం పార్టీలో హోం మంత్రి పదవికి చాలా పోటీ ఉంది. గతంలో టిడిపి అధికారంలోకి వస్తే తానే హోంమంత్రి నని చింతకాయల అయ్యన్నపాత్రుడు తేల్చి చెప్పారు. నాలాంటి వాడికి ఇస్తే వైసిపి నేతలకు బుద్ధి చెబుతానని.. శాంతి భద్రతలను దారిలోకి తెస్తానని గతంలో అయ్యన్నపాత్రుడు ఒకసారి ప్రకటించారు. ఇప్పుడు ఆయన విషయంలో లోకేష్ ఎలా స్పందిస్తారు అన్నది చర్చగా మారింది. శంఖారావ సభల్లో భాగంగా నర్సీపట్నంలో సైతం లోకేష్ కార్యక్రమం ఉండనుంది. అక్కడ కూడా ఇదే తరహాలో అయ్యన్న హోం మంత్రి అవుతారని లోకేష్ ప్రకటిస్తారా? అని సెటైర్లు పడుతున్నాయి. లోకేష్ ఈ తరహా ప్రకటనలు పార్టీకి చేటు తెస్తాయని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.