Parle Agro Company : ఏదో పనిమీద ఎండలో వెళ్తాం.. అకస్మాత్తుగా దాహం వేస్తుంది. పక్కన వాటర్ బాటిల్ ఉండదు. చిన్నపాటి షాపులోకి వెళ్లి కూల్ డ్రింక్ అడుగుతాం. ఆ టైం కు అతడు పది రూపాయలు తీసుకొని చేతిలో టెట్రా ప్యాకెట్ పెడతాడు.. అది తాగిన వెంటనే దాహం తీరుతుంది. శరీరానికి కొత్త శక్తి వస్తుంది. అక్కడ మీరు తాగిన టెట్రా ప్యాకెట్ కు చెల్లించిన ధర పది రూపాయలు మాత్రమే. కానీ అలా ఆ కూల్ డ్రింక్ తయారు చేస్తున్న కంపెనీ విలువ అక్షరాల 8000 కోట్లు. చదువుతుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ.
మన దేశంలో కూల్ డ్రింక్ వ్యాపారంలో పెప్సికో హోల్డింగ్స్, కోకో కోలా కంపెనీలదే హవా. ఈమధ్య రిలయన్స్ కూడా ఇందులోకి ప్రవేశించింది. కానీ మన దేశానికి చెందిన ఓ కంపెనీ కూల్ డ్రింక్స్ తయారీలో ఎప్పటినుంచో ఉంది. పోటీ కంపెనీలు రకరకాల కూల్ డ్రింక్స్ మార్కెట్లోకి తెచ్చినప్పటికీ.. ఆ కంపెనీ మాత్రం ఆపిల్స్, మామిడి పండ్లను మాత్రమే నమ్ముకుంది. వాటి ఆధారంగానే 8000 కోట్ల వ్యాపారం చేస్తోంది.
పార్లే ఆగ్రో.. ఈ కంపెనీ పేరు అంటే తెలియని వారు ఉంటారేమో గానీ ఫ్రూటీ, అపీ ఫిజ్ అంటే తెలియని వారు ఉండరు. పార్లే ఆగ్రో సంస్థ ఈ కూల్ డ్రింక్ ఉత్పత్తులను తయారు చేస్తోంది. ఈ కంపెనీని ప్రకాష్ చౌహాన్ ప్రారంభించారు. అయితే పోటీ కంపెనీల ప్రభావాన్ని తట్టుకోలేక పార్లే ఆగ్రో తక్కువ మోతాదులోనే వ్యాపారం చేసేది. ఫలితంగా అప్పట్లో దాని టర్నోవర్ 300 కోట్లకు మించేది కాదు. అయితే ప్రకాష్ కూతురు నదియా పార్లే ఆగ్రో కంపెనీలో చేరిన తర్వాత దాని రూపురేఖలే మారిపోయాయి. కంపెనీ ఆదాయం 300 కోట్ల నుంచి 2017లో 4200 కోట్లకు పెంచింది. ప్రస్తుతం కంపెనీ ఆదాయం గడిచిన ఆర్థిక సంవత్సరంలో 8,000 కోట్లకు పైగా పెరిగింది. కంపెనీ ఆదాయాన్ని స్థాయిలో పెంచడానికి నదియా తీవ్ర కృషి చేశారు. పోటీ కంపెనీలను తట్టుకొని నిలబడే విధంగా కంపెనీని మలిచారు. రీసెర్చ్ విభాగాన్ని ఆధునీకరించారు. కొత్త ఉద్యోగులను తీసుకున్నారు. కంపెనీకి సీఈవోగా తన సోదరి షౌనా చౌహన్ ను నియమించారు. చిన్నప్పటినుంచి తన తండ్రి వ్యాపారాన్ని చూసి పెరిగిన నదియా.. వ్యాపార మెలకువలు నేర్చుకుంది. ఖాళీ సమయాన్ని ముంబైలోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో గడిపేది. అలా అలా కంపెనీపై పూర్తిస్థాయిలో పట్టు సాధించింది.
హెచ్ఆర్ కాలేజ్ లో కామర్స్ ఎకనామిక్స్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నదియా.. 17 సంవత్సరాల వయసులోనే కంపెనీలో చేరింది. ఆ తర్వాత ఆమె హయాంలోనే 2005లో అప్పీ ఫిజ్ ను ప్రారంభించింది. ఇది బహుళ ప్రజాదరణ పొందింది. ఇది మాత్రమే కాకుండా నింబు పానీ తో సహా ఇతర ఉత్పత్తులను కూడా ప్రారంభించింది. 2015లో కొత్త తయారీ యూనిట్లను మొదలుపెట్టింది. మ్యాంగో ఫ్రూటీని మరింత ఆధునికరించింది. బెయిలీ పేరుతో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ సెగ్మెంట్ లోకి కూడా పార్లే ఆగ్రోస్ అడుగుపెట్టింది. ఇది 1000 కోట్ల వ్యాపారాన్ని నమోదు చేస్తోంది. 2030 నాటికి 20 వేల కోట్ల బ్రాండ్ గా పార్లే ఆగ్రోస్ ను మార్చాలని నదియా లక్ష్యంగా పెట్టుకుంది.
పార్లే ఆగ్రో సంస్థ 1985లో ప్రారంభమైంది. నదియా జన్మించింది. ప్రకాష్ చౌహాన్ కంపెనీ ప్రారంభించిన తొలి సంవత్సరంలో స్వీడిష్ కంపెనీ లాగా టెట్రా ప్యాక్ లో అందించే మామిడి పండ్ల రసాన్ని దేశ ప్రజలకు పరిచయం చేశారు. ఇప్పటికీ మ్యాంగో ఫ్రూటీ రూపంలో అదే టెట్రా ప్యాక్ లో విక్రయిస్తున్నారు. పార్లే గ్రూప్ ను నదియా చౌహన్ ముత్తాత మోహన్ లాల్ చౌహన్ 1929 లో ప్రారంభించారు. మోహన్ లాల్ చిన్న కుమారుడు జయంతిలాల్ 1959లో శీతల పానీయాల వ్యాపారాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం మనం చూస్తున్న థమ్స్ అప్, లిమ్కా, గోల్డ్ స్పాట్, సిట్రా, మాజా వంటి బ్రాండ్లు ఆయన తీసుకొచ్చినవే. ఈ కంపెనీలు వారసత్వం కింద రమేష్, ప్రకాష్ చౌహాన్ కు బదిలీ అయ్యాయి. ఈ బ్రాండ్లను 1990 లో కోకా కోలాకు విక్రయించారు. ఆ తర్వాత సోదరులిద్దరు తమ తమ వ్యాపారాల్లో మునిగిపోయారు.